తెలంగాణ

telangana

అడవుల్లో ఆయుధాలు.. మంత్రి హత్య కుట్ర కేసులో విస్తుగొలిపే అంశాలు

By

Published : Mar 5, 2022, 5:21 AM IST

Srinivas Goud Murder Plan: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నిన కేసులో... నిందితుల రిమాండ్ రిపోర్ట్‌లోని అంశాలు విస్తుగొలుపుతున్నాయి. నిందితులు ఆయుధాలు ఎక్కడ కొన్నారు.. ఎక్కడ దాచారు అనే అంశాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యాయి. తమను ఆర్థికంగా దెబ్బ తీసినందుకే మంత్రి హత్యకు పథకం రచించినట్లు నిందితులు వెల్లడించారు.

srinivas
srinivas

Srinivas Goud Murder Plan: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు ప్రణాళిక వేసిన కేసులో... కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న రెండు ఆయుధాల్ని అడవుల్లో దాచినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మద్యం వ్యాపారంలో తమను ఆర్థికంగా దెబ్బ తీసినందుకు కక్ష పెంచుకున్న నిందితులు.. శ్రీనివాస్ గౌడ్​తో పాటు అతడి అనుచరుడు గులామ్ హైదర్‌ను అంత మొందించేందుకు నిర్ణయం తీసుకున్నారని నిందితుల రిమాండ్ నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. హత్యకు కుట్ర పన్నిన నిందితులు.. రెండు ఆయుధాల్ని అడవుల్లో దాచినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

అడవుల్లో ఆయుధాలు...

హత్య కోసం కత్తులతోపాటు రెండు రౌండ్లతో కూడిన 9 ఎంఎం క్యాలిబర్‌ పిస్టల్, 6 రౌండ్లతో కూడిన దేశవాళీ రివాల్వర్‌ను నిందితులు సమకూర్చుకున్నారు. సుచిత్రలోని లాడ్జి వద్ద గులామ్‌ హైదర్‌పై హత్యాయత్నం విఫలం కావడం.. నాగరాజు, విశ్వనాథ్, యాదయ్య పోలీసులకు చిక్కడంతో మిగిలిన నిందితులు ఆయుధాల్ని కవరులో పెట్టి హైదరాబాద్‌ శివార్లలోని అడవుల్లో దాచారని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు నిందితులను తమ కస్టడీకి కోరుతూ పోలీసులు మేడ్చల్‌ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.

కొంత గడవు కావాలి...

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్య కుట్ర కేసులో విచారణకు హాజరయ్యేందుకు కొంత గడువు ఇవ్వాలని మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు రాజు రాష్ట్ర పోలీసులను కోరారు. విచారణకు హాజరు కావాలంటూ... పోలీసులు పంపిన నోటీసుకు ఆయన జవాబిచ్చారు. తన భార్యకు ఇటీవల ప్రమాదం జరగడంతో... ఆమెకు సేవలు చేస్తున్నానని, వెంటనే హాజరు కాలేనని వెల్లడించారు. తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని ఎఫ్​ఐఆప్​ను తనకు ఇవ్వాలని అభ్యర్థించారు. తాను మాజీ ఎంపీ పీఏనని... నివాసానికి సంరక్షకునిగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details