నూతన వ్యవసాయ చట్టాల రద్దుచేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటనపై తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్((ktr about Farm laws repeal)) స్పందించారు. పదవుల్లో ఉన్నవారి కంటే ప్రజల అధికారం గొప్పదని పేర్కొన్న మంత్రి.. అవిశ్రాంత పోరాటంతో రైతులు మరోమారు తమ శక్తిని చాటారని కొనియాడారు. జై జవాన్... జై కిసాన్ అన్న నినాదాన్ని ట్విట్టర్(ktr tweet today) ద్వారా పంచుకున్నారు.
నల్ల చట్టాల రద్దు ప్రకటనపై మంత్రి హరీశ్ రావు(harish rao about farm laws) స్పందించారు. ఇది దేశ రైతుల విజయమన్న మంత్రి... రైతులు విజయం సాధించిన తీరు అద్భుతమని కొనియాడారు. ఏడాదిగా బుల్లెట్లకు, లాఠీలకు ఎదురెళ్లి విజయం సాధించారని అన్నారు. పోలీస్ కంచెలకు, నిషేధాలకు ఎదురెళ్లి విజయం సాధించారన్న హరీశ్... రైతు శక్తిని, పోరాటాన్ని కేంద్రానికి రుచి చూపించారని ట్వీట్ చేశారు. ఇది రైతు విజయం.. దేశ ప్రజల విజయమని అన్నారు. రైతు ఉద్యమంలో పాల్గొన్న అందరికీ ఉద్యమాభివందనాలు తెలిపారు.
చరిత్రాత్మక విజయం: చాడ
సాగు చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం రైతులు సాధించిన చరిత్రాత్మక విజయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు స్వతంత్ర భారత చరిత్రలోనే మొక్కవోని దీక్షతో పోరాడుతున్న రైతుయోధులకు అభినందనలు అని చెప్పారు. రైతుల పోరాటం దేశంలోనే ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడంతో సరిపోదని.. కార్మిక కోడ్లు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
అందుకే వెనక్కి తీసుకున్నారు..: సురవరం
మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ప్రకటించడం రైతుల సుదీర్ఘ పోరాట ఘన విజయమని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి అన్నారు. లక్షలాది రైతుల శాంతియుత పోరాటాన్ని దెబ్చతీయటానికి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రిపబ్లిక్ డే నాడు మోసపూరిత చర్యలతో ఆందోళన హింసాత్మక రూపం దాల్చిందని ప్రజలను నమ్మించి, అణచివేసే కుట్ర విఫలమైందని ఆరోపించారు. ఈ ఉద్యమంలో దాదాపు 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇటీవల జరిగిన 30 ఉపఎన్నికల స్థానాల్లో 15 స్థానాలలో భాజపా ఓడిపోయిన తర్వాతే పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలన్నారు. పంజాబ్ ఎన్నికల కోసం వ్యవసాయ చట్టాలను ఉపసంహరించబోతున్నారని విమర్శించారు.
స్వాగతించిన తెలుగుదేశం..
నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడాన్ని తెలుగుదేశం స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది. రైతుల పోరాట పటిమతోనే ఇది సాధ్యమైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు పేర్కొన్నారు. గతంలోనే సాగు చట్టాలపై తెలుగుదేశం పార్టీ తన అభిప్రాయాన్ని పార్లమెంటులో స్పష్టంగా చెప్పిందన్నారు. కరోనా కారణంగా దేశంలో అన్ని పనులు ఆగిపోయినా వ్యవసాయం మాత్రం ఆగలేదని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. ఆయా చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతులకు, రైతు సంఘాలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, నాయకులకు రావుల అభినందనలు తెలిపారు. విద్యుత్ చట్టాలపైనా ఇదే స్ఫూర్తితో నిర్ణయం తీసుకోవాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మోదీ కీలక ప్రకటన..
గురునానక్ జయంతి (Guru nanak jayanti) సందర్భంగా జాతిని ఉద్దేశించి (PM Narendra Modi addresses the nation) ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలను (Farm laws 2020) రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో సాగు చట్టాల రద్దుపై ప్రకటన చేస్తామని (Farm laws repeal) పేర్కొన్నారు. దిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న రైతులు ఇక ఆందోళన విరమించి ఇళ్లకు వెళ్లాలని కోరారు.
మంచివే కానీ..
తాము తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు(Farm laws 2020) రైతులకు ప్రయోజనం చేకూర్చేవేనని, కానీ.. ఒక వర్గం రైతులను ఒప్పించలేకపోయినట్లు తెలిపారు మోదీ.
''3 వ్యవసాయ చట్టాల లక్ష్యం.. సన్నకారు రైతుల్లో సాధికారత తీసుకురావడం. ఇవి రైతులకు ప్రయోజనం చేకూర్చేవే. కానీ.. ఒక వర్గం రైతులను మేం ఒప్పించలేకపోయాం. ఐదు దశాబ్దాల నా ప్రజా జీవితంలో రైతుల కష్టాలను, సవాళ్లను తెలుసుకున్నా.''