తెలంగాణ

telangana

By

Published : Sep 25, 2020, 5:04 AM IST

ETV Bharat / state

పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసదే విజయం: కేటీఆర్​

శాసనమండలి ఎన్నికల్లో విజయం తెరాసదేనని ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు ధీమా వ్యక్తం చేశారు. అక్టోబరు 1 నుంచి పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియలో చురుగ్గా పాల్గొనాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఓ వైపు అభివృద్ధి, సంక్షేమం.. మరోవైపు పాలనా సంస్కరణలకు పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్ సర్కారుదేనన్న విషయం పట్టభద్రుల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. సుమారు లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు.. ప్రైవేట్ రంగంలో సుమారు 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారని.. ప్రతిపక్షాలే దివాళా తీశాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

minister-ktr-teleconference-with-trs-activists on graduate elections
పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసదే విజయం: కేటీఆర్​

రానున్న శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల్లో ఘన విజయం సాధించేలా పని చేయాలని తెరాస శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు పిలుపునిచ్చారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్​ఛార్జీలతో కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్ధేశం చేశారు. అక్టోబర్1 నుంచి జరగనున్న పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించాలని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. అరవై లక్షల మంది తెరాస కార్యకర్తల్లో అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. అక్టోబర్ 1న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు.

ప్రతిపక్ష పార్టీలే దివాళా తీశాయి..

రాష్ట్రావిర్భావం తర్వాత పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు అన్ని ఎన్నికల్లోనూ తెరాస ఘన విజయం సాధించిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తెరాస కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ.. ఎన్నడూ లేని విధంగా పాలన సంస్కరణలకు పెద్ద పీట వేస్తూ పాలన కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, ప్రతిపక్ష పార్టీలే దివాళా తీశాయని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలకు ప్రజల్లోకి వెళ్లేందుకు ఎజెండా కూడా దొరకని పరిస్థితి నెలకొందని అన్నారు.

లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేశాం..

పట్టభద్రుల ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే యువత, విద్యార్థులకు ప్రభుత్వం, తెరాస చేసిన కార్యక్రమాలను వివరించాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులకు కేటీఆర్ చెప్పారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వివిధ నియామక ప్రక్రియల ద్వారా సుమారు లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేశామని.. అవసరమైతే మరిన్ని ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామన్నారు. ప్రైవేటు రంగంలో సుమారు రెండు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి.. సుమారు 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత తెరాస సర్కారుదేనని కేటీఆర్ వివరించారు. ప్రతి కుటుంబానికి అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ఆయా కుటుంబాల్లోని పట్టభద్రులు గుర్తించేలా పార్టీ శ్రేణులు పనిచేయాలన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో పెద్ద ఎత్తున నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం ద్వారా వ్యవసాయ సాగు పెరిగిందని.. అరవై ఏళ్లలో చుక్క నీరు కూడా అందని అనేక పల్లెలు ఇప్పుడు జల సిరులతో కళకళలాడుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా నల్గొండ జిల్లాను పీడించిన ఫ్లోరైడ్ రక్కసిని కేవలం ఆరేళ్లలో తరిమికొట్టిన ఘనత కూడా తెరాస ప్రభుత్వానిదేనన్నారు.

త్వరలోనే టీ హబ్​, టాస్క్​

జిల్లాల పునర్విభజన, కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్​లు, పంచాయతీల ఏర్పాటుతో పాలన వికేంద్రీకరణకు ప్రయత్నించినట్లు కేటీఆర్ వివరించారు. నూతన రెవెన్యూ, పురపాలక చట్టాల వంటి వాటితో పాలన ఫలాలను ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు. యాదాద్రి క్షేత్రాన్ని దేశం గర్వించదగిన స్థాయిలో సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో పునర్నిర్మిస్తున్నారన్నారని.. వరంగల్ జిల్లాకు మెగా టెక్స్​టైల్​ పార్క్ వంటి పరిశ్రమలను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని కేటీఆర్ అన్నారు. త్వరలోనే టీ హబ్, టాస్క్ కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో వచ్చే నెలలో ఐటీ టవర్ ప్రారంభించే ప్రయత్నం చేస్తామని.. బుగ్గపాడు ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుతో పాటు పెద్ద ఎత్తున మరిన్ని ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

ఇవీ చూడండి: తెరాస శ్రేణులతో మంత్రి కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్

ABOUT THE AUTHOR

...view details