తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్​లో రెవెన్యూ సమస్యలపై సర్కార్​ ఫోకస్​

గ్రేటర్​లో మధ్య తరగతి ప్రజలకు వారి ఆస్తులపై హక్కులు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. నగర వాసులు నిశ్చింతగా వారి ఆస్తి హక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా కృషిచేస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, నగరంలోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కాలనీల సంఘాల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో పలు కాలనీల్లో ఏళ్లుగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలపై చర్చించారు.

By

Published : Sep 26, 2020, 7:08 PM IST

minister ktr review on revenue issues in greeter Hyderabad
గ్రేటర్​లో రెవెన్యూ సమస్యలపై సర్కార్​ ఫోకస్​

గ్రేటర్ హైదరాబాద్​లో ఏళ్లుగా పేరుకుపోయినా రెవెన్యు సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా భూ సమస్యలు తొలగిపోయాయని... ఇక నగరంలోని భూ సమస్యలను పరిష్కారం చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ గత ఆరేళ్లుగా దేశంలోని లక్షలాది మందికి ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందని.. ఓవైపు పెట్టుబడులు మరోవైపు పరిపాలనా సంస్కరణలు, రాజకీయ స్థిరత్వంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ విస్తరిస్తోందని అన్నారు. ఇలాంటి సందర్భంగా ఆస్తి వివాదాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే సమస్యలు పరిష్కారం చేస్తున్నామని తెలిపారు.

ఇబ్బందులు లేకుండా

హైదరాబాద్ నగరంలో సుమారు 24 లక్షల 50 వేల ఆస్తులు ఉన్నట్లు అంచనా వేశామని... ఇందులో పలు కారణాలతో కొన్ని ఆస్తుల హక్కులపై సమస్యలు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో హైదరాబాద్​లోని ఆస్తుల క్రయ విక్రయాల్లో ఇబ్బందులు లేకుండా సంస్కరణలు తెస్తున్నామని పేర్కొన్నారు.

సామాన్యుడికి భారం పడొద్దు

ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా తమ వ్యవసాయ భూముల పైన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు పోతోందని మంత్రి స్పష్టం చేశారు. సామాన్యుడిపై ఎలాంటి భారం పడకుండా... అండగా ఉంటూ అవినీతికి పాతర వేస్తూ నూతన చట్టానికి ఆమోదం తీసుకున్నామని గుర్తుచేశారు. భవిష్యత్తులో రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ ఆధారంగానే జరుగుతాయని... వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకి ప్రత్యేకంగా రెండు వేరు వేరు రంగుల్లో పాస్ పుస్తకాలు ఇస్తామని అన్నారు.

దళారులను నమ్మొద్దు

ప్రస్తుతం వ్యవసాయేతర ఆస్తుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తుందని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదని... కేవలం ప్రజలకు వారి ఆస్తుల పైన హక్కులు కల్పించాలన్న ప్రయత్నమే చేస్తున్నమనే విషయాన్ని ప్రజలు గమనించాలని వివరించారు. రానున్న 15 రోజుల పాటు ధరణి పోర్టల్​లో ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా చురుగ్గా పాల్గొనాలని... ఇందులో దళారులను నమ్మవద్దని ఒక్కపైసా ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు.

ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, ఉచితంగా జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీటిపై విస్తృతంగా చర్చించిన తర్వాత అవసరమైతే కేబినెట్ ద్వారా ప్రత్యేక నిర్ణయాలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. కేటీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి

ఇదీ చూడండి :నిండుకుండలా మారిన దిగువ మానేరు జలాశయం

ABOUT THE AUTHOR

...view details