తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐదు నెలల చిన్నారికి రాత్రికిరాత్రి పాలు పంపిన కేటీఆర్ - ఐదు నెలల చిన్నారికి పాలు పంపించిన మంత్రి కేటీఆర్

ఐదు నెలల పసికందుకు తాగేందుకు పాలు లేక... మంత్రి కేటీఆర్​కు ట్వీట్ చేశారు పక్కింటి వాళ్లు. వెంటనే స్పందించిన మంత్రి వారికి పాలు అందేలా చేసి పాప ఆకలి తీర్చారు.

KTR RESPONDS ON TWITTER
‘ఐదు నెలల చిన్నారి.. తాగేందుకు పాలు లేవు’

By

Published : Apr 18, 2020, 4:36 PM IST

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మంత్రి కేటీఆర్‌.. తన దృష్టికి వచ్చే చాలా సమస్యలను పరిష్కరిస్తుంటారు. లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో ఆయనకు విన్నవించుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. చాలా వరకు కేటీఆర్‌ తన కార్యాలయం ద్వారా ఆయా సమస్యలను పరిష్కరిస్తున్నారు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఎర్రగడ్డలో ఐదు నెలల పసికందు తాగేందుకు పాలు లేవంటూ పక్క ఇంటి వాళ్లు చేసిన విజ్ఞప్తికి అర్ధరాత్రి సమయమైనా తక్షణమే స్పందించి సహాయం అందించే ఏర్పాటు చేశారు.

వివరాల్లోకి వెళితే.. ఎర్రగడ్డలో నివసించే ఓ కుటుంబం రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆ ఇంట్లో ఐదు నెలల పసికందు ఉంది. అనారోగ్య కారణాలతో చిన్నారి తల్లి కొద్దిరోజుల క్రితం చనిపోయింది. తండ్రే ఆ పాప ఆలనా పాలనా చూసుకుంటున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు నెలరోజులుగా ఉపాధి లేకపోవడంతో పాపకు పాలు, ఇతర నిత్యావసర వస్తువులు అందించడం కష్టంగా మారింది. పక్క ఇంట్లో ఉన్న ఓ వ్యక్తి ఈ విషయాన్ని తెలుసుకుని గురువారం రాత్రి ట్విటర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాడు.

తక్షణమే స్పందించిన ఆయన.. వెంటనే వెళ్లి ఆదుకోవాలని జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ను ఆదేశించారు. కేటీఆర్‌ చెప్పిన అరగంటలోనే రాత్రి ఒంటిగంట సమయంలో ఫసియుద్దీన్‌ ఆ కుటుంబం వద్దకు వెళ్లి ఆ పాపకు కావాల్సిన పాలు, ఇతర వస్తువులతో పాటు నెలరోజులకు సరిపడా నిత్యావసరాలను అందించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆదుకున్న కేటీఆర్‌, ఫసియుద్దీన్‌కు ఆ కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. చెప్పగానే ఆ కుటుంబం వద్దకు వెళ్లి సహాయం అందించిన ఫసియుద్దీన్‌ను కేటీఆర్‌ అభినందించారు.

ఇవీ చూడండి:కరోనా కట్టడికి మరిన్ని కీలక నిర్ణయాలు

ABOUT THE AUTHOR

...view details