పురపాలక శాఖ పనితీరుపై 2020-21 వార్షిక నివేదికలను మంత్రి కేటీఆర్ (ktr) విడుదల చేశారు. గతేడాదిలో చేసిన పనులను నివేదికలో పొందుపరచడమే కాకుండా 2021-22 కార్యాచరణను అందులో పేర్కొన్నారు. కరోనా భయానక పరిస్థితుల్లో నిస్వార్థ సేవలు అందించిన పురపాలశాఖ అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకొని పట్టణాల్లో మౌలిక సదుపాయల పనులు పూర్తి చేసినట్లు వివరించారు. అన్ని పట్టణాల్లోనూ వ్యర్థాలు, మానవ వ్యర్థాల శుద్ధిప్లాంట్లు ఉన్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని పేర్కొన్నారు. మూసీనదిపై 15 కొత్త వంతెనలు ఏర్పాటుకు నిర్ణయించినట్లు తెలిపారు. పీఎం స్వనిధి అమల్లో దేశంలోనే ముందంజలో ఉన్నందుకు అధికారులను అభినందించారు.
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత
పట్టణాల సమీకృత సమగ్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రాబోయే ఏళ్లలో పురోగతిని కొనసాగిస్తామని చెప్పారు. పీఎం స్వనిధిని దేశంలోనే ప్రథమంగా అమలు చేసిన తెలంగాణలో వీధివ్యాపారులకు 347 కోట్ల రుణాలు ఇచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు. 184 కోట్లతో హైదరాబాద్ దుర్గం చెరువు వద్ద తీగల వంతెన, లైటింగ్, వాస్తు, శిల్పకాంతుల పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. జీడిమెట్ల వద్ద రోజుకు 500 టన్నుల సామర్థ్యంతో మొట్టమొదటి నిర్మాణ, కూల్చివేతల నిర్వహణ ప్లాంటుతో పాటు జవహర్ నగర్ వద్ద దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి 19.8 మెగావాట్ల సామర్థ్యంతో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు పురపాలకశాఖ తెలిపింది.
చేసిన పనుల జాబితా..
ఓఆర్ఆర్పై మిగిలిన 136 కిలోమీటర్ల పొడవునా ఎల్ఈడీ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు... పది ట్రామా రక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. వీటి ద్వారా ఇప్పటి వరకు 110కి మందికిపైగా సత్వర చికిత్స అందించి విలువైన ప్రాణాలు కాపాడడంతో పాటు 225 మందికి ప్రాథమిక చికిత్స అందించినట్లు తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో నెలకు 20వేల లీటర్ల చొప్పున ఉచితంగా మంచినీటి పథకాన్ని ప్రారంభించినట్లు పేర్కొంది. మొదటి లాక్డౌన్ సమయంలో 373 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఉచిత భోజనం అందించినట్లు, 2020-21లో 2.53 కోట్ల భోజనాలు అందించినట్లు తెలిపింది. జీహెచ్ఎంసీలో 224 బస్తీ దవాఖానాలు ఉండగా... ప్రారంభానికి మరో 31 సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. ఫ్లైఓవర్లు, ఆర్యూబీ, అండర్ పాసులు పూర్తి చేయడంతో పాటు 28 కిలోమీటర్ల మేర 16 గ్రీన్ఫీల్డ్ లింక్ రోడ్లు పూర్తి చేసినట్లు వివరించింది.
గ్రేటర్లో నర్సరీలకు ప్రాధాన్యం