KTR on Bilkis Bano Case: బిల్కిస్ బానో అత్యాచార దోషుల విషయంలో మంత్రి కేటీఆర్ నిప్పులు చెరుగుతున్నారు. 11 మంది నిందితులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయటాన్ని తీవ్రంగా తప్పుబట్టిన మంత్రి కేటీఆర్.. ఇప్పుడు మరోసారి స్పందించారు. స్వాత్రంత్య్ర దినోత్సవం రోజునే 11 మంది దోషులను విడుదల చేయడాన్ని మంత్రి కేటీఆర్ ఖండించారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ జోక్యం చేసుకుని ఆ రేపిస్టులను విడుదల చేయకుండా.. కఠిన శిక్ష పడేలా చూడాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి కూడా చేశారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్తో పాటు పలువురిని నుంచి వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే.. బిల్కిస్బానో నిందితుల విడుదలపై ట్విటర్లో మంత్రి కేటీఆర్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు వదిలారు. ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు ఎన్నో హామీలు ఇస్తాయని పేర్కొన్నారు. సాధారణంగా అభివృద్ధి, భద్రత, సంక్షేమంపై హామీలు ఇవ్వడం చూశాం. ఇప్పుడు మహిళలు, చిన్నారులను చంపిన దోషులను విడుదల చేస్తున్నారని సెటైర్ వేశారు. ఇలాంటి ఖైదీల విడుదల, శిక్ష తగ్గింపు ఎప్పటికీ మరిచిపోలేనిదని ట్విటర్ వేదికగా తెలిపారు. 'కర్మ ఈజ్ బూమరాంగ్' అంటూ ట్వీటారు. కేటీఆర్ ట్వీట్కు నెటిజన్స్ నుంచి మద్దతు లభించింది. కొంత మంది సూపర్ సార్ అంటూ కామెంట్స్ పెట్టగా.. మరికొంత మంది నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు.
బిల్కిస్బానో నిందితుల విడుదల అప్పటి నుంచి మంత్రి కేటీఆర్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేపిస్టులకు పూల మాలలు వేసి యుద్ధ వీరుల్లా సత్కరించటం మన దేశంలోనే చెల్లుతుందని నిర్వేదం వ్యక్తం చేశారు. కొందరి తీరుకిది నిదర్శనమనమంటూ ఫైర్ అయ్యారు. బిల్కిస్కి జరిగిన ఘటన మనలో ఎవరికైనా జరగొచ్చని.. నిందితులకు పూల మాలలు వేయటంపై భారత్ గొంతెత్తి ప్రశ్నించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.