ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప ప్రజా నాయకుడు, పాలనాదక్షుడని ప్రజా గాయకుడు గద్దర్ వాఖ్యానించారు. దేశ రాజకీయాల గతిని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు గాను కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే.. దానికి అనుబంధంగా కల్చరల్ ఫ్రంట్ పెట్టి సంపూర్ణ మద్దతిస్తానన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా వెంకటాపురం డివిజన్ తెరాస ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం గద్దర్ను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. కేసీఆర్ తెలంగాణ సాధనకు 14 రోజుల పాటు కఠోర దీక్ష చేసిన సందర్భాన్ని గుర్తు చేశారు. గొప్ప నాయకుడైన కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పెట్టినట్టయితే, దానికి అనుబంధంగా కల్చరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఆయనతో ముందుకు సాగాలనేది తన అభిమతమన్నారు.