Ministers Review On power distribution companies: రాష్ట్ర విద్యుత్ పంపిణీ వ్యవస్థలపై పలు ఛార్జీలు, రుసుముల పేరుతో కేంద్రం భారం మోపుతున్నందున విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు నష్టాలు పెరిగిపోతున్నాయని మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డిలు స్పష్టం చేశారు. డిస్కంల ఆర్థిక పరిస్థితిపై వరసగా రెండోరోజు వారు ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శి సునీల్ శర్మ, ట్రాన్స్కో-జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు, దక్షిణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి, ట్రాన్స్కో జేఎండీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
‘‘తెలంగాణ ఏర్పడే నాటికే రూ.12,185 కోట్ల నష్టాలతో డిస్కంలున్నాయి. విద్యుత్ రంగంపై కేంద్రం తీసుకున్న నిర్ణయాలు అదనపు భారంగా పరిణమించాయి. అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అందించిన రాష్ట్ర సర్కారుపై విద్యుత్ సంస్కరణల పేరుతో మోదీ సర్కారు ఆర్థికభారం మోపుతోంది. గ్రీన్ ఎనర్జీ రుసుం గతంలో టన్ను బొగ్గు వినియోగంపై రూ.50 ఉండగా.. ఒక్కసారిగా 400 రూపాయలకు పెంచడంతో రూ.7,200 కోట్ల అదనపు భారం పడింది. డిస్కంలు థర్మల్ కేంద్రాల నుంచి ఏటా 50 వేల మిలియన్ యూనిట్లను కొంటున్నాయి. కేంద్రం బొగ్గు ధరలను సాలీనా 6 నుంచి 10 శాతానికి పెంచడంతో రూ.725 కోట్లు డిస్కంలపై భారం పడుతోంది. గడిచిన నాలుగేళ్లలో బొగ్గు రవాణాకు రైల్వే ఛార్జీలు 40 శాతం పెంచింది. సీలేరు, కృష్ణపట్నం కేంద్రాల నుంచి తెలంగాణ డిస్కంలకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కరెంటు కొనడంతో సంస్థలపై రూ.2763 కోట్ల అదనపు భారం పడింది. ఏపీలోని విద్యుదుత్పత్తి సంస్థలు కరెంటును ఆపేయడంతో తెలంగాణ సంస్థలు రూ.2502 కోట్లు భరించాల్సి వచ్చింది.