కొవిడ్ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సహా పోస్ట్ కొవిడ్ కేసుల నిర్వహణ, చికిత్సకు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీకి సంబంధించి.. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు డీహెచ్, డీఎంఈ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శులు విడివిడిగా కోర్టుకు నివేదికలు సమర్పించారు. వ్యాక్సినేషన్, కొవిడ్ కట్టడిపై కోర్టుకు నివేదించిన డీహెచ్ శ్రీనివాస రావు.. జులై 4 నుంచి ఆగస్టు 8 వరకు రోజుకి సరాసరి 1,15,986 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో పాజిటివిటీ కేవలం 0.5 శాతంగా ఉందని కోర్టుకు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 428 ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక బిల్లులపై ఇప్పటి వరకు 756 ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. అందులో 74 ఫిర్యాదులను పరిష్కరించి.. బాధితులకు రూ. 1,36,63,740 తిరిగి చెల్లించినట్లు కోర్టుకు నివేదించారు.
వారికి టీకాలు
ఇప్పటి వరకు మొత్తం 1,54,82,496 డోసుల టీకాలను పంపిణీ చేశామని తెలిపిన డీహెచ్.. ఖైదీలు, సాధువులు, యాచకులు, మానసిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రారంభించినట్టు న్యాయస్థానానికి వివరించారు. ఖైదీలు, ఓల్డెజ్ హోంలలో ఇప్పటి వరకు 2921 మందికి టీకాలు అందించామని చెప్పారు. మానసిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలోనూ 407 మందికి టీకాలు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. జూన్లో 1,41,697 మంది పాఠశాలల సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు వెల్లడించారు. డీపీహెచ్, డీఎంఈ, టీవీవీపీల్లో, ఆస్పత్రుల్లో కలిపి ఖాళీగా ఉన్న 3,311 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి.. 2,418 మందిని రెగ్యులర్ పద్ధతిలో విధుల్లోకి తీసుకున్నామని చెప్పారు. అర్హులైన వారు అందుబాటులో లేకపోవటం వల్ల మరో 893 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించారు.