కొవిడ్-19 నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల వసతి గృహాల్లో పరిశుభ్రతను పెంపొందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని గవర్నర్ తమిళిసై అన్నారు. రాజ్భవన్ నుంచి దృశ్యశ్రవణ మాధ్యమం ద్వారా పీవీ నర్సింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం డీన్ డా. ఎస్టీ వీరోజీరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పీపీఈ కిట్లు సమకూర్చాలి..
కరోనా మహమ్మారి కట్టడి చేసే తరుణంలో వ్యక్తిగత రక్షణ కోసం పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. పశు వైద్య శాస్త్ర కళాశాలలు, పాల సాంకేతిక పరిజ్ఞానం, మత్స్య సంపద, విద్యా, బోధన, విస్తరణ, పరిశోధన, పరిపరిపాలనా కార్యకలాపాల అమలు, ఆర్థిక స్థితి తీరు వంటి పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.
చర్యల గురించి ఆరా..
భారీ ప్రాజెక్టులు, పరిశ్రమ, మార్కెట్ అవసరాలను తీర్చడానికి సిలబస్, కోర్సుల్లో నాణ్యత పెంచడానికి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, ఆచార్యులు అభివృద్ధి చేసిన సాంకేతికత పరిజ్ఞానం, పొడిగింపు కార్యకలాపాలు, కౌన్సెలింగ్, ఇ- లైబ్రరీ సౌకర్యం మొదలైన అంశాలు అడిగి తెలుసుకున్నారు.