కొవిడ్ పరిస్థితుల తర్వాత వ్యాపార వర్గాలు డిజిటల్ మంత్రాన్ని పఠిస్తున్నాయి. రాష్ట్రాన్ని డిజిటల్ రంగంలో ముందుకు తీసుకుపోవడంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. స్థానికంగా లభ్యమయ్యే ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్లు కల్పించి.. చిరు వ్యాపారులకు చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో మేడ్ ఇన్ తెలంగాణ మాల్ (MADE IN TELANGANA MALL) యాప్ను ప్రారంభించింది. అధికారికంగా దీన్ని ప్రారంభించినప్పటికీ... జనవరి నుంచి ఈ ప్లాట్ఫాం అందుబాటులోకి రానుంది.
ఈ యాప్ ద్వారా స్థానికంగా దొరికే వస్తువులను ఈ పోర్టల్ ద్వారా ప్రదర్శించి, విస్తృత మార్కెట్ కల్పనకు అవకాశం లభిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే పోచంపల్లి చీరలు, ముత్యాలు, బిద్రి కళారూపాలు మొదలైనవి ఈ ఆన్లైన్ మాల్ ద్వారా దేశవ్యాప్తంగా అమ్మకోవచ్చు. 2022 జనవరి నుంచి కొనుగోలుదారులకు మేడ్ ఇన్ తెలంగాణ మాల్ యాప్ అందుబాటులోకి రానుంది. ఈ సదుపాయం ద్వారా దళారుల ప్రమేయం లేకుండా చిరువ్యాపారులు తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. దీనికోసం ఎటువంటి రుసుం చెల్లించనవసరం లేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ (Jayesh Ranjan) తెలిపారు.