Lovers Suicide in Hyderabad : ఈ మధ్యకాలంలో చిన్నపాటి కారణాలకే క్షణికావేశంలో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చదువుకునే విద్యార్థుల నుంచి కాటికి కాలు చాచిన వృద్ధుల వరకూ చాలా మంది తమ సమస్యలకు బలవన్మరణమే పరిష్కారమని భావిస్తూ తమ ప్రాణాలు బలితీసుకుంటున్నారు. సిల్లీ కారణాలతో మనస్తాపం చెంది జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ముఖ్యంగా యువత ఆత్మహత్యలకు ఎక్కువగా పాల్పడుతోంది. ఇక ప్రేమ పేరుతో బలవుతున్న ప్రాణాలకు లెక్కే లేదు.
Lovers Suicide in Hyderabad : కేపీహెచ్బీ కాలనీలో ప్రేమజంట ఆత్మహత్య.. స్నేహితుడి గదికి వెళ్లి మరీ.. - latest hyderabad crime news
![Lovers Suicide in Hyderabad : కేపీహెచ్బీ కాలనీలో ప్రేమజంట ఆత్మహత్య.. స్నేహితుడి గదికి వెళ్లి మరీ.. Lovers Suicide in Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/1200-675-18507145-863-18507145-1684132476838.jpg)
11:34 May 15
కేపీహెచ్బీ కాలనీలో ప్రేమ జంట ఆత్మహత్య
Lovers Suicide in at KPHB Hyderabad : అమ్మాయి ప్రేమించడం లేదనో.. అబ్బాయి మోసం చేశాడనో.. ప్రేమించిన అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లాడిందనో.. పెద్దలు తమ ప్రేమను అంగీకరించడం లేదనో.. ఇలా ప్రేమ పేరుతో రకరకాల కారణాల వల్ల యువతీయువకులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రేమలో పడి.. కొన్ని రోజుల క్రితం పరిచయమైన వారి కోసం తమను కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారు. కలిసి బతకలేనప్పుడు.. కలిసి చావడమే కరెక్ట్ అని భావిస్తూ బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్లో చోటుచేసుకుంది.
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన ఆకుల శ్యామ్(24), పోతుల జ్యోతి(22) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్యామ్ భీమవరంలో ఉంటుండగా.. జ్యోతి హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలోని ఓ హాస్టల్లో ఉంటోంది. జ్యోతికి గతంలో వివాహం కాగా విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటుంది. అయితే ఈనెల 12వ తేదీన శ్యామ్ హైదరాబాద్కు వచ్చాడు. వచ్చిన వెంటనే జ్యోతిని కలిశాడు. ప్రేమజంట కేపీహెచ్బీ కాలనీలోని వంశీకృష్ణ గదికి శుక్రవారం వచ్చారు. వంశీకృష్ణ తన వివాహం ఉండటంతో, ఆ ఇద్దరికి గదిలో ఉండమని చెప్పి ఊరికి వెళ్లాడు. గత రెండ్రోజులుగా ఇద్దరు అక్కడే ఉంటున్నారు.
అయితే ఇవాళ ఆ గది నుంచి దుర్వాసన రావడంతో ఇంటి పక్కన వారు కిటికీలో నుంచి చూశారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి వారు షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు బద్ధలు కొట్టారు. లోపలికి వెళ్లి చూడగా జ్యోతి పురుగుల మందు సేవించి నిర్జీవంగా కనిపించగా.. శ్యామ్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి మృతికి గల కారణాలపై వారి స్నేహితులను ఆరా తీస్తున్నారు.