తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్​: పెద్దమొత్తంలో మందులు కొనుగోలు చేస్తున్న రోగులు - latest news on Lockdown Effect: Patients buying bulk drugs

కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ ప్రభావం ఔషధ రంగంపైనా పడింది. కర్ఫ్యూ ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితుల్లో రోగులు ఎక్కువ మొత్తంలో మందులు కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఔషధ దుకాణాల్లో నిల్వలు నిండుకుంటున్నాయి.

Lockdown Effect: Patients buying bulk drugs
లాక్‌డౌన్‌ ఎఫెక్ట్​: పెద్దమొత్తంలో మందులు కొనుగోలు చేస్తున్న రోగులు

By

Published : Mar 30, 2020, 8:04 AM IST

దేశవ్యాప్తంగా అమలవుతోన్న లాక్‌డౌన్‌ ప్రభావం వల్ల నిల్వ ఉంచుకునేందుకు గానూ రోగులు ఎక్కువ మొత్తంలో మందులు కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఔషధ దుకాణాల్లో వాటి నిల్వలు నిండుకుంటున్నాయి. రక్తపోటు, చక్కెర వ్యాధులకు సంబంధించిన మందులతో పాటు ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు కూడా ప్రస్తుతం అందుబాటులో లేవంటూ దుకాణాదారులు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాలు సహా హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ కీళ్ల నొప్పుల మందులు లభ్యం కావడం లేదు. తయారీదారుల నుంచే సరఫరా నిలిచిపోయిందని విక్రయదారులు పేర్కొంటున్నారు.

ఔషధ కంపెనీల నుంచి మందుల సరఫరా డిమాండ్‌ మేరకు లేదు. సరుకు రవాణాకు కార్మికులు అందుబాటులో లేకపోవడం వల్ల ఆర్డర్లను తీసుకోవడం లేదు. ఫలితంగా పంపిణీదారులకు.. వారి నుంచి చిల్లర ఔషధ దుకాణాలకూ సరఫరా నిలిచిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల టోకు, చిల్లర ఔషధ దుకాణాలు ఉండగా.. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కొరత ప్రారంభమైంది.

ముందు జాగ్రత్తగా కొనుగోళ్లు..

లాక్‌డౌన్‌ నుంచి ఔషధ దుకాణాలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చినా రోగులు ముందు జాగ్రత్తగా ఎక్కువ మొత్తంలో కొనుగోళ్లు చేస్తున్నారు. పది రోజుల వ్యవధిలో చక్కెర, బీపీలకు సంబంధించిన మందుల నిల్వలన్నీ అయిపోయాయని హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌కు చెందిన ఓ ఔషధ దుకాణం యజమాని తెలిపారు. కీళ్లనొప్పుల మందులను రెట్టింపు పరిమాణంలో కొనుగోలు చేయడం వల్ల తమ ప్రాంతంలో వాటి నిల్వలు నిండుకున్నాయని వికారాబాద్‌ జిల్లా కోస్గి మండలంలోని ఓ విక్రయదారుడు పేర్కొన్నారు. గ్రామీణులు, ఔషధ దుకాణాలు అందుబాటులో లేనివారు కనీసం మూడు నెలలకు సరిపడా మందులు కొనుగోలు చేస్తున్నట్లు చాలామంది విక్రయదారులు పేర్కొన్నారు.

ఆరు రోజులుగా నిలిచిన సరఫరా..

హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో ఉన్న మందుల పంపిణీదారుల నుంచి చిల్లర వర్తకులకు సరకు సకాలంలో అందడం లేదు. ప్రస్తుతం ఆరు రోజులుగా సరఫరా నిలిచిపోయిందని దుకాణాదారులు పేర్కొంటున్నారు. తయారీ సంస్థల నుంచే సరఫరా లేదంటూ టోకు వర్తకులు చెబుతున్నారు. దిల్లీ, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాలతో పాటు హైదరాబాద్‌ నగరంలోని పలు సంస్థలు కార్మికుల కొరత కారణంగా ఔషధాలను సరఫరా చేయలేకపోతున్నారన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మొదట్లో కొన్ని సంస్థల్లో ఉత్పత్తి నిలిచిందని, ఈ ప్రక్రియ ఇప్పుడిప్పుడే కొంతమేరకు ప్రారంభమైందని వారు పేర్కొంటున్నారు.

నెలకు మించి ఇవ్వొద్దు..

"మందుల తయారీదారుల నుంచి సరఫరా తగ్గిపోయింది. కరోనా నేపథ్యంలో ఒకేదఫా రెండు, మూడు నెలలకు సంబంధించి రోగులు కొనుగోలు చేస్తుండటం వల్ల ఔషధ నిల్వలు తగ్గిపోయాయి. ఫలితంగా రక్తపోటు, చక్కెర తదితర వ్యాధులకు గాను ఒక నెలకు సరిపడా మందులనే విక్రయించాలని దుకాణదారులకు స్పష్టం చేశాం. తయారీదారుల నుంచి మందులు సకాలంలో అందేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి."

- సతీష్‌రావు, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కెమిస్ట్‌, డ్రగ్గిస్ట్‌ సంఘం

ఇవీ చూడండి: అవసరమే ఆవిష్కరణకు బీజం..

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details