మార్చి 25 నుంచి రైళ్ల రాకపోకలు పూర్తిగా బంద్ అవ్వడంతో రైల్వే కూలీలు కుదేలైపోయారు. ప్రత్యేక రైళ్లు నడిచినా.. అవి పరిమిత సంఖ్యలో ఉండడంతో ప్రయాణికులు చేతి బ్యాగులు మోసుకొని ప్రయాణాలు సాగించేశారు. మరో 18 రైళ్లు సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్నా.. అవి కూడా రైల్వే కూలీల ఆకలి తీర్చలేకపోతున్నాయి. అలవాటు పడిన ప్రాణాలు కనుక.. రైల్వే స్టేషన్కు చేరుకుని పట్టాలవైపు దీనంగా చూస్తున్నారు.
500 మంది రైల్వే కూలీలకు కష్టకాలం..
సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి రోజు 315 రైళ్ల వరకూ రాకపోకలు సాగించేవి. ఇలా ఈ మూడు స్టేషన్ల నుంచి 3.50 లక్షల నుంచి 4 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రైల్వే ప్రయాణికుల బ్యాగులు మోసి ఈ మూడు రైల్వే స్టేషన్లలో కలిపితే 500లకు పైగా రైల్వే కూలీలు జీవనోపాధి పొందేవారు. మూడు నెలలుగా బరువు మోయక నెత్తి తేలికగా మారిపోగా.. రూపాయి రాక జేబు ఖాళీగా మారిపోయింది.
కూలీల జీవితాలు ప్రశ్నార్థకం
ద.మ. రైల్వే అధికారులు, రైల్వే ఉద్యోగుల మహిళా సంఘం, రైల్వే వాణిజ్య విభాగాలు కలిసి.. రైల్వే కూలీలందరికీ రెండు పర్యాయాలు 10 కేజీలు బియ్యం, రూ. 600ల విలువైన రేషన్ సరకులు, రూ.500లు ఇచ్చి ఆదుకున్నారు. ఈ సాయం వారికి ఎంతో ఊరటనిచ్చినా.. ఒక వారం, రెండు వారాలు, నెల అయితే ఫర్వాలేదు కాని.. ఏకంగా 3 నెలలు రైళ్లు పూర్తి స్థాయిలో నడవకపోవడంతో.. మళ్లీ వారి జీవితాలు ప్రశ్నార్థకంగా మారిపోయాయి. ఇప్పుడు ఆగస్టు నెల 12 వరకూ రైళ్లు నడవవని భారతీయ రైల్వే ప్రకటించడంతో.. దిక్కు తోచని స్థితిలో రైల్వే పట్టాలవైపు చూస్తున్నారు.