Neknampur lake Protest : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నెక్నాంపూర్ చెరువును పరిసర కాలనీల వాసులంతా ఏకతాటిపైకి శుద్ధి చేసుకున్నారు. సొంతఖర్చుతో ఏడాదిపాటు శ్రమించి గుర్రపు డెక్క తీయించుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం స్పందించి.. చెరువు శుద్ధికి రూ.22 కోట్లు కేటాయించింది. కానీ సమయం గడుస్తున్న చెరువు ఖాళీ చేయడం తప్ప... సుందరీకరణ పనులు మాత్రం ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు చెరువు మధ్యలో ఎస్టీపీ నిర్మిస్తామనడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో కాలనీవాసులకు చెరువు శుద్ధిలో సహకరించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి... సర్కారు తీరుపై మండిపడుతున్నారు. ప్రభుత్వమే కబ్జాదారుగా మారుతోందని విమర్శించారు.
మంచిగా చేయాలంటే లేక్ను ఎస్టీపీ చేస్తున్నారు. ఇది బాధాకరం. ఎవరో బిల్డర్ చేయడం కాదు. ప్రభుత్వమే ఎస్టీపీ చేస్తే అది చట్టానికి విరుద్ధం. ఇక్కడే కాదు మేము లేక్ కమిటీలు ఎన్నో ఏర్పాటు చేశాం. రియల్ ఎస్టేట్ వాళ్ల మాటలు విని లేక్ నాశనం చేస్తున్నారు. మీ ప్లాన్ సరిదిద్దుకోవాలి. మీ ఆలోచన సరిదిద్దుకోవాలి.
-కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ
చెరువు మధ్యలో 10 ఎకరాల్లో ఎస్టీపీ నిర్మాణం సరికాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 120 ఎకరాల్లో ఉన్న చెరువు ఇప్పటికే 99 ఎకరాలకు కుంచించుకుపోయిందని వాపోయారు. ఎస్టీపీ నిర్మాణంతో ఎవరికీ మేలు జరగదని సర్కారుకు విన్నవిస్తున్నారు.
మా పైసలతోనే లేక్ను సాఫ్ చేశాం. తర్వాత మంత్రి కేటీఆర్ వచ్చి లేక్ను గవర్నమెంట్ పైసలతోనే సాఫ్ చేస్తామని చెప్పారు. అంత మంచిగ అవుతుంది.. లేక్ మంచిగా అయిందనుకున్న సమయంలో వచ్చి... ఎస్టీపీ పెడుతున్నారు. కబ్జా కాకుండా చూడాల్సిన ప్రభుత్వమే ఎస్టీపీ పెడితే... ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది?.
చందన, నెక్నామ్పూర్ కాలనీ వాసి