తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు 50 శాతం కేటాయించాలి: కృష్ణాబోర్డుకు లేఖ - water issue

krishna river board
రాష్ట్ర ప్రభుత్వం లేఖ

By

Published : Jul 20, 2021, 8:45 PM IST

Updated : Jul 20, 2021, 10:52 PM IST

20:42 July 20

'ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు 50 శాతం కేటాయించాలి'

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ప్రస్తుత నీటి సంవత్సరానికి కృష్ణా జలాలను... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​కు 50:50 నిష్పత్తిలో కేటాయించాలని కోరింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ ఛీఫ్ మురళీధర్... కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్​కు లేఖ రాశారు.

లేఖలో అంశాలు

ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు లేనందున కృష్ణ జలాలను ప్రతి ఏడాది తాత్కాలిక పద్ధతిన వినియోగించుకుంటున్నామని లేఖలో పేర్కొన్నారు. అదే తరహాలో 2020-21కి సంబంధించి కూడా... చిన్ననీటివనరులు, పట్టిసీమ నుంచి తరలించే గోదావరి జలాలు, ఆవిరి నష్టాలను మినహాయించి 34:66 నిష్పత్తిలో వినియోగించుకున్నట్లు లేఖలో స్పష్టం చేశారు. 

కృష్ణా పరివాహక ప్రాంతం, సాగు విస్తీర్ణం, కరవు ప్రాంతాలు, జనాభాను పరిగణలోకి తీసుకుంటే.. జలాల్లో తెలంగాణకు 70.8శాతం, ఆంధ్రప్రదేశ్​కు 29.2శాతం రావాల్సి ఉందని తెలిపారు. అందుకే 771 టీఎంసీలు కేటాయించాలని ట్రైబ్యునల్ ముందు డిమాండ్ ఉంచినట్లు వెల్లడించారు. బేసిన్ అవసరాలు తీరాకే... వెలుపలకు నీటిని తరలించాలని ట్రైబ్యునల్ తీర్పులు స్పష్టం చేస్తున్నాయని ప్రస్తావించారు. శ్రీశైలం నుంచి రోజుకు 4.7టీఎంసీల నీటిని తరలించేలా... ఆంధ్రప్రదేశ్​కు అనుమతి లేని వ్యవస్థ ఉందన్న ఈఎన్సీ... పెన్నా సహా ఇతర బేసిన్లలో ఉన్న 300 టీఎంసీల సామర్థ్యం కలిగిన జలాశయాల్లో ఆ నీటిని నిల్వ చేసుకోవచ్చని తెలిపారు. 

తెలంగాణకు కేవలం రోజుకు 0.28 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోతల ద్వారా తీసుకునే వెసులుబాటు ఉందని అన్నారు. బేసిన్ వెలుపలకు ఏపీ నీటిని తరలించకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇటీవల అత్యున్నత మండలి సమావేశంలోనూ సీఎం కేసీఆర్ ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. వీటన్నింటి నేపథ్యంలో ప్రస్తుత నీటి సంవత్సరం 2021-22లో రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాలు 50:50 నిష్పత్తిలో ఉండాలని కోరారు. రాష్ట్రం ఏర్పాటై ఏడేళ్లు అయినప్పటికీ తెలంగాణకు సరిపడా నీళ్లు లేకపోవడంతో తీవ్రంగా నష్టం జరుగుతోందని... ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు చెరి సగం కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో బేసిన్ వెలుపలకు కృష్ణా జలాలను తరలించకుండా నిలువరించాలని ఈఎన్సీ మురళీధర్ కేఆర్ఎంబీ ఛైర్మన్​ను కోరారు.  

ఇదీ చూడండి:WATER BOARDS: కృష్ణా, గోదావరి బోర్డులకు విస్తృతాధికారాలు కల్పించిన కేంద్రం

Last Updated : Jul 20, 2021, 10:52 PM IST

ABOUT THE AUTHOR

...view details