రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన రోగులు కోలుకుని ఇంటిముఖం పడుతున్న వేళ.. హైదరాబాద్ మహానగరంలో మాత్రం వైరస్ వణుకుపుట్టిస్తోంది. ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో తన పంజా విసురుతోంది. గడిచిన నాలుగు రోజుల్లో కేసుల సంఖ్య రెండెకల్లో ఉంటుండగా.. బల్దియాలో అధికారిక లెక్కల ప్రకారమే ఇప్పటివరకు 800కుపైగానే కేసులు నమోదైనట్లు సమాచారం. అయితే వాటిలో చాలా మంది చికిత్స తీసుకొని కోలుకోగా.. ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్ట్ల నుంచి వైరస్ వ్యాప్తి చెందుతుందనే అనుమానంతో వారందరిని గుర్తించి హోంక్వారంటైన్లోనే ఉంచి ఆరోగ్యపరిస్థితిని సమీక్షిస్తున్నారు.
తాజాగా అక్కడ తిష్టవేసింది
నిన్న మొన్నటి వరకు వనస్థలిపురాన్ని కుదిపేసిన కరోనా వైరస్.. తాజాగా జియాగూడలో తిష్టవేసింది. నగరంలో నమోదవుతున్న కేసుల్లో జియాగూడ, కార్వాన్ ప్రాంతాల్లో 81 కేసులు ఇక్కడే ఉన్నాయి. ఈ మేరకు ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించిన బల్దియా యంత్రాంగం.. జియాగూడ పరిసరాలను అష్టదిగ్బంధనం చేసింది. ఆ ప్రాంతంలో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ప్రభావిత కాలనీలు, బస్తీలను గుర్తించి 10 కంట్మెనెంట్ జోన్లను ప్రకటించారు. వాటిలో వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటింటికి తిరిగి ఆరా తీస్తున్నారు. వెంకటేశ్వరనగర్, ఇందిరానగర్, శ్రీనగర్లోని సబ్జిమండి కూరగాయల మార్కెట్, జియాగూడ మేకలమండి, మటన్, చికెన్ దుకాణాలు, మిగతా దుకాణాలన్నింటిని మూసివేశారు. కేవలం ఔషధ దుకాణాలు, వైన్షాపులు మాత్రం నడుస్తున్నాయి. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జియాగూడ ప్రాంతం మొత్తాన్ని బంద్ ప్రకటించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కేసులు పెరుగుతున్నా జనాలు మాత్రం
నగరంలోని వలసకూలీలు కూడా అత్యధికంగా కరోనా బారినపడుతున్నారు. బల్దియా అధికారులు అనుమానంగా ఉన్న మిగతా వలస కూలీలకు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసుల సంఖ్య పెరుగుతున్నా జనాలు మాత్రం రోడ్లపైకి భారీగా వస్తున్నారు. నిత్యం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ వాహనాలు జప్తు చేస్తున్నా ఎలాంటి కారణం లేకుండా రోడ్లపై తిరిగేవారు ఎక్కువయ్యారు. మద్యం దుకాణాలు ప్రారంభించిన మొదటి రెండు, మూడు రోజులు రద్దీ కనిపించినా ప్రస్తుతం వాటివద్ద హడావుడి తగ్గింది. కొన్ని ప్రైవేటు కార్యాలయాలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి. ప్రజా రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.