తెలంగాణ

telangana

By

Published : Mar 4, 2023, 4:00 PM IST

ETV Bharat / state

మరో 3 నెలల్లో స్టీల్ బ్రిడ్జి పనులు పూర్తవ్వాలి.. అధికారులకు మంత్రి ఆదేశం

KTR Inspected Steel Bridge Works In Hyderabad: ఎస్​ఆర్డీపీ ఫ్లై ఓవర్ల మాదిరిగా వీఎస్టీ-ఇందిరా పార్కు వద్ద నిర్మిస్తున్న స్టీల్​ బ్రిడ్జి కూడా అద్భుత నిర్మాణంగా మారబోతుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. స్టీల్​ బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తర్వాత హుస్సేన్ సాగర్ సర్పేస్ నాలా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు.

minister ktr
మంత్రి కేటీఆర్

KTR Inspected Steel Bridge Works In Hyderabad: సెంట్రల్ హైదరాబాద్ నగరానికి ప్రభుత్వం నిర్మిస్తున్న వీఎస్టీ-ఇందిరా పార్క్ వద్ద స్టీల్ బ్రిడ్జి తలమానికంగా మారబోతుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ముందుగా ఇందిరాపార్క్ వద్ద నిర్మిస్తున్న స్టీల్​ బ్రిడ్జి పనుల పురోగతిని జీహెచ్​ఎంసీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం స్టీల్​బ్రిడ్జి నిర్మాణంపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ స్టీల్​బ్రిడ్జి పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇందుకు అవసరమైన ట్రాఫిక్​ మళ్లింపులు వంటి అంశాల విషయంలో నగర ట్రాఫిక్ పోలీసు విభాగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మూడు నెలల్లోగా నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన అదనపు బృందాలను ఏర్పాటు చేసి.. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వర్కింగ్ ఏజెన్సీని ఆదేశించారు.

ఎస్​ఆర్డీపీ ఫ్లైఓవర్ల మాదిరిగా స్టీల్​బ్రిడ్జి అద్భుత నిర్మాణం: నిర్మాణ పనులను పరిశీలించుకుంటూ మంత్రి కేటీఆర్ వీఎస్టీ చేరుకున్నారు. అక్కడ దాదాపు పూర్తయిన ర్యాంపు పైనుంచి బ్రిడ్జి నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఇప్పటికే నగరంలో పూర్తయిన ఎస్​ఆర్డీపీ ఫ్లైఓవర్ల మాదిరిగా.. ఈ స్టీల్​బ్రిడ్జి సైతం అద్భుతమైన నిర్మాణంగా మారబోతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. 2.8 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల స్టీల్​బ్రిడ్జి కోసం జీహెచ్​ఎంసీ దాదాపు రూ.440 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.

ఆర్టీసీ క్రాస్​ రోడ్డు వద్ద ట్రాఫిక్​ను తగ్గించి.. ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్​పేట్ వంటి నియోజకవర్గాల ప్రజల సౌకర్యార్థం ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలనే డిమాండ్ రెండు దశాబ్దాలుగా ఉందని చెప్పారు. ఇంతటి కీలకమైన బ్రిడ్జి నిర్మాణం సత్వరంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే సాధారణ కాంక్రీట్ నిర్మాణం కాకుండా స్టీల్ బ్రిడ్జిగా నిర్మాణం చేస్తున్నామని వివరించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం మూడు నెలల్లో పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో నగర వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పరిశీలన: స్టీల్ ​బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఎస్​ఎన్​డీపీ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పలు మౌలిక సదుపాయాల కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. హుస్సేన్​ సాగర్ సర్పేస్​ నాలాలో చేపడుతున్న పనులను సమీక్షించారు. అశోక్​నగర్ వద్ద కొనసాగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. వరద ప్రాంతాలను గుర్తించి.. వరద ప్రమాదాన్ని తగ్గించే విధంగా అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు కేటీఆర్ తెలిపారు. హుస్సేన్ సాగర్ వరద ముంపునకు గురైనప్పుడు ఆ పరిసర లోతట్టు ప్రాంతాలు మునిగిపోకుండా సర్పేస్ నాలాలకు భారీ ఎత్తున నిధులు కేటాయించి.. రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నట్లు చెప్పారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details