హైదరాబాద్ నగరంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా పర్యటించి పలు అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 45లో నిర్మిస్తున్న పై వంతెనతో పాటు దుర్గం చెరువు పై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి పనులను తనిఖీ చేశారు. త్వరితగతిన పనులను పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సంబంధిత శాఖల మధ్య సమన్వయం గురించి ఆయా శాఖల అధికారులతో చర్చించారు. ట్రాన్స్ కో విద్యుత్ లైన్ల తరలింపు, నూతన విద్యుత్ టవర్ల నిర్మాణం వంటి పెండింగ్ పనుల గురించి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడారు.
ఇంజినీర్లతో పనులపై సమీక్ష
రెండు వారాల్లోగా ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన మేరకు విద్యుత్ లైన్లను తరలిస్తామని విద్యుత్ అధికారులు మంత్రికి వెల్లడించారు. బ్రిడ్జిని నిర్మిస్తున్న ఎల్.అండ్.టి ఇంజినీర్లతో పనుల ప్రగతి వివరాలను తెలుసుకున్నారు. బ్రిడ్జి పనులు దాదాపు పూర్తి అయినట్లు అధికారులు స్పష్టం చేశారు.