KRMB Letter : నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగించుకోవద్దని కేఆర్ఎంబీ సూచించింది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు లేఖలు రాసింది. 809 అడుగుల పైన ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 34 టీఎంసీల నీరు ఉందని... కనిష్ఠ వినియోగ మట్టాన్ని పరిగణనలోకి తీసుకుంటే నికరంగా 5.2 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉందని బోర్డు తెలిపింది. కానీ, మే నెల వరకు తాగునీటి అవసరాల కోసం 3.5 టీఎంసీలు కావాలని తెలంగాణ, 6 టీఎంసీలు కావాలని ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తులు పంపినట్లు కేఆర్ఎంబీ పేర్కొంది.
సాగర్ నుంచి పంపింగ్ చేయండి..
ప్రస్తుత పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల వినతుల ప్రకారం సరిపడా తాగునీరు ఇవ్వడం సాధ్యమయ్యే పరిస్థితి లేదన్న బోర్డు... శ్రీశైలం జలాశయం నుంచి తాగునీటి కోసం మినహా విద్యుత్ ఉత్పత్తి, ఇతర అవసరాల కోసం నీటి వినియోగాన్ని ఆపివేయాలని స్పష్టం చేసింది. తాగునీటి అవసరాలకు సరిపడా జలాల కోసం తెలంగాణ ఆధీనంలో ఉన్న ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా నాగార్జున సాగర్ నుంచి నీటిని శ్రీశైలం జలాశయానికి రివర్స్ పంపింగ్ చేసే విషయాన్ని పరిశీలించాలని కేఆర్ఎంబీ తెలిపింది. అటు నీటి అవసరాల విజ్ఞప్తులను సవరించి పంపాలని కూడా బోర్డు రెండు రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు ఈఎన్సీలకు మరో లేఖ రాసింది.