Krishna River Management Board Meeting Today : నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల అంశంపై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశానికి తెలంగాణ హాజరు కాలేదు. వర్చువల్ విధానంలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఇవాళ మధ్యాహ్నం జరిగింది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి రాయిపురే, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ వర్చువల్ సమావేశానికి హాజరు కాలేదు.
Telangana ENC not Attends KRMB Meeting : తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడికాల్వకు ఐదు టీఎంసీల నీరు విడుదల చేయాలని ఏపీ ఇప్పటికే కృష్ణా బోర్డును కోరింది. తమ విజ్ఞప్తి మేరకు నీటి విడుదల ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శిని కోరారు. తెలంగాణ గైర్హాజరు నేపథ్యంలో బోర్డు ఛైర్మన్తో మాట్లాడతానని బోర్డు సభ్య కార్యదర్శి రాయిపురే చెప్పినట్లు సమాచారం.
Discussion On Nagarjunasagar Water Release : ప్రస్తుత నీటి సంవత్సరం ప్రారంభమై 45 రోజులు పూర్తైనప్పటికీ నదుల్లోకి పెద్దగా ప్రవాహాలు లేవు. గోదావరిలో కొంత మేర ఉన్నప్పటికీ కృష్ణాలో మాత్రం పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. ఇప్పటి వరకు ఎగువ నుంచి ప్రవాహాలు లేవు. ఉపనది తుంగభద్ర నుంచి కూడా ఆశించిన మేర నీరు కృష్ణాలోకి చేరడం లేదు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోకి ఇప్పటి వరకు నీరు చేరలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న ఉమ్మడి జలాశయాల్లో నీటిమట్టం కనీస స్థాయిలోనే ఉంది.