వర్షాధార పంటలకు చినుకు బెంగ
కృష్ణా, గోదావరి నదుల్లో పుష్కలంగా వరద వస్తుండటం వల్ల జలాశయాలు నిండాయి. నీటి వనరులున్న ప్రాంతాల్లో పంటలకు ఢోకా లేదు. ఈ నెల 10 వరకూ విస్తారంగా వర్షాలు పడటం వల్ల పైర్లు కళకళలాడుతున్నాయి. గత ఐదు రోజులుగా వర్షాలు తగ్గిపోయాయి. మరో వారం రోజులు వర్షాలు లేకపోతే... పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలిపారు.
పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న వర్షాలు
ప్రస్తుతం రుతు పవనాల కదిలికలు బలహీనంగా ఉన్నాయి. శనివారం నుంచి 3 రోజులపాటు భారీ వర్షాలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడనున్నాయని తెలిపింది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వర్షాభావం, ఆ తర్వాత అధిక వర్షాలతో పంటల సాగుపై ప్రభావం పడింది.
తొమ్మిది జిల్లాల్లో 20 నుంచి 47 శాతం వర్షపాతం లోటు
రాష్ట్రంలో 46వేల 764 చెరువులు ఉండగా... వీటిలో 26వేల 196 చెరువుల్లో 25 శాతం లోపే నీరుంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 9 జిల్లాల్లో వర్షపాతం లోటు 20 నుంచి 47 శాతం వరకు ఉంది. రాష్ట్రంలో మొత్తం సాగు విస్తీర్ణం 43.34 లక్షల హెక్టార్లు కాగా... ఖరీఫ్లో 80 శాతం అంటే 34.48 లక్షల హెక్టార్ల మేర రైతులు పంటలు వేశారని వ్యవసాయశాఖ తాజా నివేదికలో వెల్లడించింది.