విత్తన రంగంలో తెలంగాణ చేపడుతున్న విప్లవాత్మక విధానాలపై ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు డాక్టర్ స్వామినాథన్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర విత్తన సంస్థ ఎండీ, అంతర్జాతీయ విత్తన సంస్థ ఉపాధ్యక్షుడు డాక్టర్ కేశవులు... స్వామినాథన్ ఫౌండేషన్ ఆహ్వానం మేరకు చైన్నైలో ఆయనను కలుసుకున్నారు. విత్తన రంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పరిణామాలు, సమస్యలపై చర్చించారు.
దేశానికే ఆదర్శంగా నిలావాలని ఆకాంక్ష...
వ్యవసాయ రంగంలో విత్తనం ప్రధాన భూమిక పోషిస్తుందని, విత్తనాల నాణ్యత, రైతులకు సరఫరా, ప్రమాణాలు విషయంలో ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు వస్తున్నాయి. వాటికి అనుగుణంగా భారత్ స్పందించి పరిశోధన రంగంలో ఇంకా పురోగమించాల్సి ఉందని స్వామినాథన్ అభిప్రాయపడ్డారు.
ప్రాధాన్యం సరిగా లేదని ఆవేదన
వ్యవసాయ పరిశోధనల్లో కేంద్రం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు విత్తన రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ విత్తన సంస్థ, రాష్ట్రాల విత్తన సంస్థలు తన నాయకత్వంలోనే స్థాపించినప్పటికీ... పనితీరు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశం నుంచి కేశవులు వంటి వ్యక్తి అంతర్జాతీయ సంస్థకు ఎన్నిక కావడం దేశానికి... ముఖ్యంగా తెలంగాణకు గర్వకారణమని స్వామినాథన్ ప్రశంసించారు.
అవగాహనే కీలకం
రైతులు, అధికారులు, నిపుణులకు విస్తృతంగా నిరంతర అవగాహన కల్పిచాలని, వెంటనే కార్యాచరణలో పెట్టే అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు. విత్తన రంగంలో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుండి అందరికీ ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షించారు. అనతికాలంలో ప్రపంచ విత్తన భాండాగారంగా తెలంగాణ అవతరించబోతుందని ప్రభుత్వాన్ని స్వామినాథన్ అభినందించారు.
ఇదీ చూడండి : 'డెంగీ'పై హైకోర్టు సీరియస్