Kantivelugu program in Assembly lobby: తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి, ప్రశాంత్ రెడ్డి కంటి పరీక్షలను చేయించుకున్నారు. కంటి పరీక్షలో స్పీకర్ పోచారం కంటిచూపు సరిగానే ఉందని వైద్యులు పేర్కొనగా.. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఆఖరి లైన్ కనిపించలేదని గుర్తించారు.
దీంతో 'కంటి చూపులో నీనే మీ కంటే యంగ్గా ఉన్నా అంటూ పోచారం.. ప్రశాంత్ రెడ్డితో సరదా వ్యాఖ్యానించారు'. కార్యక్రమంలో మాట్లాడిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. కంటి వెలుగును దేశంలోనే గొప్ప కార్యక్రమంగా పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు సైతం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. మరోవైపు అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు స్టాల్ల వద్దకు ఎంఐఎం శాసన సభ్యులు అక్బరుద్దీన్, పాషా ఖాద్రి, ముంతాజ్ ఖాన్లను ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు దగ్గరుండి తీసుకొచ్చారు. అనంతరం వారికి కంటీ పరీక్షలు చేయించి.. పథకం ప్రాముఖ్యతను వివరించారు.
"ఇప్పటి వరకూ 27లక్షల మంది కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో భాగంగా పరీక్షలు చేయించుకున్నారు. 5లక్షల మంది కంటి అద్దాలను తీసుకున్నారు. వీటితో పాటుగా మరో 4లక్షల అద్దాలను ప్రభుత్వం ఇవ్వడానికి సిద్దంగా ఉంది. ఆ అద్దాలు వచ్చిన తరువాత లబ్దిదారులకు నేరుగా వాళ్ల ఇంటి వద్దకే తీసుకొని వెళ్లి ఇస్తాం. దేశానికి ఆదర్శవంతమైన పథకం కంటివెలుగు. దీనిని అందరూ సద్వినియోగపరుచుకోండి."- పోచారం శ్రీనివాస రెడ్డి, శాసన సభ స్పీకర్