KA Paul Got 805 votes in munugode bypoll: మునుగోడు ఉప ఎన్నిక ప్రక్రియ మొదలైనప్పటి నుంచి తనదైన శైలిలో వినూత్న ప్రచారం చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ప్రసార మాధ్యమాల దృష్టిని ఆకర్షించారు. ఒక రోజు రైతు వేషంలో, మరో రోజు గొర్రెల కాపరి వేషధారణలో ప్రజల వద్దకు వెళ్లారు. నవంబర్ 3న పోలింగ్ రోజు 100 పోలింగ్ కేంద్రాలను చుట్టేయాలని లక్ష్యంగా పెట్టుకుని హడావుడి చేశారు. మీడియాతో మాట్లాడేందుకు కూడా సమయం లేదంటూ పోలింగ్కేంద్రాల వద్ద పరుగెత్తి హల్చల్ చేశారు.
అప్పుడప్పుడు పోలీసులు, అధికారులతో దురుసుగా ప్రవర్తిస్తూ, మీడియాకు ఇంటర్వూలు ఇస్తూ .. ఉత్కంఠగా సాగిన మునుగోడు ఉప ఎన్నికలో తనదైన ముద్ర వేశారు కేఏ పాల్. ఇంత చేసినా చివరికి ఆయన కేవలం 805 ఓట్లు మాత్రమే సాధించారు. అన్ని రౌండ్లలోనూ రెండు అంకెల సంఖ్యకే పరిమితమయ్యారు. అత్యధికంగా 13వ రౌండ్లో 86 ఓట్లు, అత్యల్పంగా 15వ రౌండ్లో 11 ఓట్లు సాధించారు. ఇంత జరిగినా కేఏ పాల్ తన ఓటమిని అంగీకరించేందుకు నిరాకరించారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, వీవీప్యాట్లోని స్లిప్పులు లెక్కిస్తే తనకు లక్ష ఓట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. స్ట్రాంగ్ రూమ్లో కొన్ని ఖాళీ ఈవీఎంలు పెట్టారని, వాటిని కౌంటింగ్ ఈవీఎంల్లో కలిపేశారని సంచలన ఆరోపణలు చేశారు.