తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రధాని మోదీ కేవలం రాజకీయాల కోసమే హైదరాబాద్‌ వచ్చారు: కేటీఆర్‌ - ప్రధాని పర్యటనపై కేటీఆర్ ట్వీట్

KTR Reacts on PM Modi Speech in Hyderabad : ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనపై ట్విటర్ వేదికగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కేవలం రాజకీయాల కోసం ప్రధాని హైదరాబాద్ వచ్చారని ఆరోపించారు. ఎన్నో అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న తెలంగాణ గురించి ప్రధాని మోదీ నోటి నుంచి ఒక్క అభినందన రాలేదని వ్యాఖ్యానించారు. గడచిన 9 ఏళ్లలో తెలంగాణతో సమానంగా వృద్ధి సాధించిన రాష్ట్రాన్ని చూపాలని ప్రధానికి సవాల్‌ విసిరారు.

KTR
KTR

By

Published : Apr 9, 2023, 10:40 AM IST

KTR Reacts on PM Modi Speech in Hyderabad : ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. తెలంగాణలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మోదీ.. సీఎం కేసీఆర్​ను ఉద్దేశిస్తూ పరోక్షంగా బీఆర్​ఎస్ సర్కార్​పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని ఆరోపణలపై నిన్న స్పందించిన బీఆర్​ఎస్ మంత్రులు ఆ వ్యాఖ్యలను తిప్పికొట్టారు.

ఇంటింటికీ తాగు నీరు అందించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ : తాజాగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రధాని హైదరాబాద్ పర్యటనపై ట్విటర్ వేదికగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గడచిన 9 ఏళ్లలో తెలంగాణతో సమానంగా వృద్ధి సాధించిన రాష్ట్రాన్ని చూపాలని ప్రధానికి సవాల్‌ విసిరారు. దేశంలోనే తెలంగాణ అత్యధిక తలసరి వృద్ధి కలిగిన రాష్ట్రమన్న మంత్రి కేటీఆర్.. ఇంటింటికీ తాగునీరు అందించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయటంతో పాటు.. దేశంలో ఉత్తమ గ్రామీణ అభివృద్ధి నమూనా కలిగి వంద శాతం ఓడీఎఫ్ ప్లస్‌ని సాధించామన్నారు.

ప్రధాని మోదీ నోటి నుంచి ఒక్క అభినందన రాలేదు : దేశంలోనే అత్యధికంగా వరిని ఉత్పత్తి చేస్తున్న రెండో రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పునరుద్ఘాటించారు. యువతకు ఉద్యోగ కల్పనలో ముందంజలో ఉన్నామన్నారు. తెలంగాణలో గ్రీన్ కవర్ వృద్ధి 7.7 శాతంగా ఉందన్న కేటీఆర్.. అత్యధిక అవార్డులు అందుకున్న రాష్ట్రంగా తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. భారత జీడీపీ వృద్ధిలో సహకారం అందిస్తున్న 4వ ముఖ్యమైన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్న మంత్రి కేటీఆర్... దేశంలో అత్యుత్తమ పారిశ్రామిక విధానం, అతిపెద్ద టెక్ట్స్​టైల్ పార్క్, ప్రపంచ వ్యాక్సిన్ హబ్​లు తెలంగాణ ప్రత్యేకతలన్నారు. ఎన్నో అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న తెలంగాణ గురించి ప్రధాని మోదీ నోటి నుంచి ఒక్క అభినందనా రాలేదని వ్యాఖ్యానించారు. రాజకీయాల కోసం అత్యుత్తమ పర్ఫార్మింగ్ రాష్ట్రంగా తెలంగాణను ప్రధాని అంగీకరించలేకపోతున్నారన్నారంటూ ట్విటర్​ వేదికగా మంత్రి కేటీఆర్ విమర్శించారు.

మరోవైపు ప్రధాని మోదీ ప్రసంగంపై శనివారం ఇతర మంత్రులు సైతం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్‌ కుటుంబం లక్ష్యంగా మోదీ విమర్శలు గుప్పించడాన్ని అమాత్యులు తప్పుపట్టారు. కేసీఆర్‌ దార్శనికతతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని వివరించారు. కేంద్రం పూర్తిస్థాయిలో సహకరించకపోయినా సొంత నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details