అల్వాల్లోని ఓ ప్రముఖ కళాశాల డిగ్రీ కోర్సులు నడిపేందుకు ఓయూ అఫిలియేషన్ తీసుకుంది. రెండేళ్ల క్రితం కూకట్పల్లికి బదలాయించుకుంది. అనంతరం పేరు మార్పునకు అనుమతి లభించకున్నా పేరు మార్చి కూకట్పల్లిలో కళాశాల నిర్వహిస్తోంది. సాధారణ డిగ్రీ కోర్సుల నిర్వహణకు అనుమతి ఉండగా.. ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులూ నడుపుతోంది. అటు అల్వాల్, ఇటూ కూకట్పల్లిలోనూ ప్రవేశాలు తీసుకుంటుండటం గమనార్హం. తాజాగా విద్యార్థులకు తాము చదువుతున్న కళాశాల పేరిట కాకుండా వేరొక కళాశాల పేరుతో హాల్టికెట్లు రావడంతో అసలు విషయం వెలుగు చూసింది. రామంతాపూర్లో మరో డిగ్రీ కళాశాల యాజమాన్యం సైతం ఇదే తరహాలో నిబంధనలు అతిక్రమిస్తోంది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని కొన్ని అనుబంధ కళాశాలలు నిబంధనలు అతిక్రమిస్తున్నాయి. సాధారణ డిగ్రీ కోర్సులు నిర్వహించేందుకు అనుమతి తీసుకుని బిజినెస్ స్కూల్ పేరిట ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు నిర్వహిస్తున్నాయి. ఎలాంటి గుర్తింపు లేకున్నా.. నేరుగా కోర్సులు నిర్వహిస్తూ అక్రమ దందాకు పాల్పడుతున్నాయి. వాస్తవానికి బిజినెస్ విభాగంలో కళాశాలల నిర్వహణకు ఏఐసీటీఈ నుంచి అనుమతి తీసుకోవాలి. ఉస్మానియా తరఫున సైతం బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలకు అనుమతిస్తున్నా.. అవి ఎంబీఏ కోర్సుల వరకే పరిమితం. వాటిని కూడా బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ పేరిట ఓయూ నుంచి గుర్తింపు ఇస్తోంది. కానీ ఇందుకు విరుద్ధంగా డిగ్రీ కళాశాలల పేరుతో బిజినెస్ స్కూల్ నిర్వహిస్తూ విద్యార్థుల నుంచి అందిన కాడికి దండుకుంటున్నారు.
వార్షిక ఫీజు రూ.లక్షకుపైనే