తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొవిడ్‌ వ్యాక్సిన్ల తరలింపునకు సర్వం సిద్ధం' - టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖరరెడ్డి ఇంటర్వ్యూ

రాష్ట్రానికి కొవిడ్‌ టీకా ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా.. క్షేత్రస్థాయిలో పంపిణీకి యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉందని రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఎండీ చంద్రశేఖరరెడ్డి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 1.5 కోట్లు, జిల్లాల్లో మరో 1.5 కోట్లు చొప్పున మొత్తంగా 3 కోట్ల డోసులను ఏకకాలంలో నిల్వ చేయగలిగే సామర్థ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంపొందించిందని ఆయన పేర్కొన్నారు.

కొవిడ్‌ వ్యాక్సిన్ల తరలింపునకు సర్వం సిద్ధం: టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖరరెడ్డి
కొవిడ్‌ వ్యాక్సిన్ల తరలింపునకు సర్వం సిద్ధం: టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖరరెడ్డి

By

Published : Jan 4, 2021, 6:31 AM IST

కొవిడ్‌ టీకా ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా.. పంపిణీకి సన్నద్ధంగా ఉన్నామని రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ఎండీ చంద్రశేఖరరెడ్డి తెలిపారు. 10వేల కేంద్రాల్లో టీకాలను అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందనీ... ఒకవేళ టీకాలిచ్చే క్రమంలో ఎటువంటి దుష్ఫలితం తలెత్తినా సత్వర చికిత్స అందించేందుకు 20వేల ప్రత్యేక కిట్లను సిద్ధం చేశామన్నారు. కొవిడ్‌ టీకాల పంపిణీలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అనుసరించిన కార్యాచరణ ప్రణాళికలపై టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖరరెడ్డితో ప్రత్యేక ముఖాముఖి.

ఒకచోటు నుంచి మరోచోటుకు టీకాల తరలింపు సవాల్‌ కదా?

కచ్చితంగా సవాల్‌తో కూడుకున్నదే. అయితే మనకు ఇప్పటికే సార్వత్రిక టీకాలను అందజేస్తున్న అనుభవం ఉన్నది కాబట్టి.. కొవిడ్‌ టీకా సరఫరాకు అది ఉపయోగపడుతుంది. టీకాలను సరఫరా చేయడానికి రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే ఒక అతి శీతలీకరణ వాహనం ఉండగా.. మరో 16 జిల్లాల్లోనూ ఇదే తరహా వాహనాలు ఇప్పటికే సేవలందిస్తున్నాయి. వీటికి అదనంగా మరో 19 ఇన్సులేటెడ్‌ వాహనాలను త్వరలోనే కొనుగోలు చేయనున్నాం. ఇందులో 2 రాష్ట్ర స్థాయిలో సేవలందిస్తాయి. మిగిలిన 17 వాహనాలను జిల్లాకొకటి చొప్పున ప్రభుత్వం కేటాయించింది. వాటితో రాష్ట్రంలోని ప్రతి జిల్లాకో ఇన్సులేటెడ్‌ వాహనం ఉంటుంది. వీటిలో 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద టీకాలను చాలాకాలం నిల్వ ఉంచవచ్చు. ఆ వాహనాల్లోనే టీకాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, ఇతర ఆసుపత్రులకూ సరఫరా చేస్తారు. ముందుగా వైద్య, పోలీసు, పారిశుద్ధ్య తదితర ముందువరుసలో నిలిచే సిబ్బందికి టీకాలు అందించనుండడంతో.. ప్రస్తుతమున్న వాహనాలతోనే అన్ని జిల్లాలకూ టీకాలను సరఫరా చేయొచ్చు. ఇప్పటికిప్పుడు టీకాలొచ్చినా పంపిణీ చేయడానికి ఎటువంటి అవరోధాలు లేవు. రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ మార్గనిర్దేశం చేస్తోంది. ప్రతి దశలోనూ సాంకేతిక సమస్యలను అధిగమించడానికి సాంకేతిక కమిటీనీ ప్రభుత్వం నెలకొల్పింది. పరికరాల నిల్వకు కూడా ఒక నిపుణుల కమిటీ ఉంది. ఈ కమిటీల సూచనలతో ముందుకెళ్తున్నాం.

టీకాల కేంద్రాల్లో ఎటువంటి ఏర్పాట్లు చేశారు

రాష్ట్రంలో 10 వేల కేంద్రాల్లో టీకాలను అందించడానికి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, పాఠశాలలు, సామాజిక భవనాలను సిద్ధం చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ఈ కేంద్రాలకు ప్రత్యేక శీతల పెట్టెల్లో టీకాలను తరలిస్తారు. ప్రతి టీకా కేంద్రంలోనూ 3 గదులుండేలా చర్యలు చేపట్టారు. టీకాలిచ్చే క్రమంలో ఎటువంటి దుష్ఫలితాలు వచ్చినా.. వెంటనే చికిత్స అందించేందుకు 14 రకాల ఔషధాలు, పరికరాలతో కూడిన కిట్‌ను అందుబాటులో ఉంచనున్నాం. తాగునీరు, విద్యుత్‌ సరఫరా, శానిటైజర్లు మాస్కులు, గ్లౌజులు, 50 లక్షల సిరంజీలు, 50 వేల టీకాలను తెరిచే పరికరాలు, తదితరాలన్నింటినీ ఇప్పటికే సిద్ధం చేశాం.

టీకా నిల్వ కేంద్రాల్లో ఉష్ణోగ్రతను ఎలా పరిశీలిస్తారు?

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొవిన్‌ యాప్‌ ద్వారా అతి శీతల పరికరాల పర్యవేక్షణా సాధ్యమవుతుంది. అన్ని స్థాయిల్లోని అతిశీతల పరికరాల్లో ఉష్ణోగ్రత నిబంధనల మేరకు ఉంటోందా? లేదా? అనేది ఎప్పటికప్పుడూ రాష్ట్రస్థాయిలో నిపుణుల కమిటీ పర్యవేక్షిస్తుంటుంది. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే ఆన్‌లైన్‌లో వెంటనే తెలిసిపోతుంది. సత్వరమే చర్యలు తీసుకోవడానికి వీలుపడుతుంది.

కొవిడ్‌ టీకాల పంపిణీపై ప్రధానంగా దృష్టిపెట్టిన అంశాలేమిటి?

ఇప్పటి వరకూ రెండు టీకాలకు అనుమతి లభించింది. ఇందులో ఏది రాష్ట్రానికి వస్తుందో స్పష్టత లేదు. ఏ టీకా వచ్చినా రోడ్డు లేదా విమాన మార్గం ద్వారా రావాల్సి ఉంటుంది. ఒకవేళ పుణె నుంచి వస్తే ఇన్సులేటెడ్‌ కార్గో విమానంలో తీసుకొస్తారు. విమానాశ్రయానికి వచ్చిన తర్వాత ప్రత్యేక అతి శీతలీకరణ కంటైనర్‌లో రాష్ట్రస్థాయి టీకా నిల్వ కేంద్రానికి తరలిస్తారు. ఒకవేళ హైదరాబాద్‌ టీకానే మన రాష్ట్రానికి కేటాయిస్తే.. రోడ్డు మార్గంలో రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వస్తాయి. అయితే టీకాలను రాష్ట్ర స్థాయిలో నిల్వ కేంద్రానికి చేర్చడం.. అక్కడి నుంచి జిల్లా కేంద్రాలకు తరలించడం.. ఆ తర్వాత ఆసుపత్రులకు చేరవేయడం చాలా ప్రధానమైంది. ఇందులో సివిల్‌, ఎలక్ట్రికల్‌, పరికరాలు, ఔషధాలు.. ఈ నాలుగు విభాగాలకు కీలక పాత్ర ఉంటుంది. టీకాల నిల్వకు అవసరమైన పనులను యుద్ధప్రాతిపదికన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలిచ్చారు. ఇందుకు అవసరమైన నిధులనూ మంజూరు చేశారు. దీంతో రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ అన్ని దశల్లోనూ టీకాల నిల్వ, పంపిణీకి పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాం.

ఏకకాలంలో ఎందరికి టీకాలిచ్చేలా నిల్వ సామర్థ్యముంది?

రాష్ట్రంలో ఏటా సుమారు 6 లక్షల మంది చిన్నారులకు సార్వత్రిక టీకాలు అందిస్తున్నారు. ఇది నిరంతర ప్రక్రియ. వీటి నిల్వకు రాష్ట్రస్థాయి టీకాల నిల్వ కేంద్రంలో 88 క్యూబిక్‌ మీటర్ల సామర్థ్యమున్న 3 అతి శీతల పరికరాలున్నాయి. ఇవికాక హైదరాబాద్‌ సహా అన్ని పూర్వ జిల్లా కేంద్రాల్లోనూ ఒక్కోటి 53 క్యూబిక్‌ మీటర్ల సామర్థ్యంతో.. మొత్తంగా 10 వాకిన్‌ కూలర్స్‌ ఇప్పటికే ఉన్నాయి. వీటికి అదనంగా కొత్తగా ఒక్కోటి 40 క్యూబిక్‌ మీటర్ల సామర్థ్యంతో 4 వాకిన్‌ కూలర్లను, 20 క్యూబిక్‌ మీటర్ల సామర్థ్యంతో 6 వాకిన్‌ ఫ్రీజర్లను కొనుగోలు చేయనున్నాం. మరో 10-12 రోజుల్లో ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతమున్న అతి శీతలీకరణ పరికరాలతో 1.5 కోట్ల కొవిడ్‌ టీకాలను నిల్వ చేయొచ్చు. కొత్తవి వస్తే మరో 1.5 కోట్ల టీకాలను భద్రపర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఈ వ్యవహారాలన్నింటిలోనూ ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా వైద్యమంత్రి ఈటల రాజేందర్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఒక డోసు తర్వాత రెండో డోసు ఇవ్వడానికి 28 రోజుల సమయం ఉంటుంది కాబట్టి.. టీకాల నిల్వకు సమస్యలు ఏర్పడే అవకాశాల్లేవు.

ఇదీ చూడండి:కొవాగ్జిన్‌కు డీసీజీఐ లైసెన్సింగ్‌ అనుమతి

ABOUT THE AUTHOR

...view details