తెలంగాణ

telangana

లాక్​డౌన్​ తర్వాత ఐటీ కొలువుల పరిస్థితి ఏమిటంటే...

By

Published : Apr 10, 2020, 7:28 AM IST

Updated : Apr 10, 2020, 11:53 AM IST

దేశంలో స్వల్పకాల లాక్‌డౌన్‌తో ఐటీ రంగంపై పెద్దగా ప్రభావం ఉండదని హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు మురళి బొల్లు తెలిపారు. నెలల తరబడి లాక్‌డౌన్‌ కొనసాగితే ఐటీ కంపెనీలతో పాటు అందులో పనిచేసే ఉద్యోగులకూ భారీ ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. అమెరికా, యురోపియన్‌ దేశాలు కొవిడ్‌ నుంచి కోలుకుని వేగంగా సాధారణ స్థితికి వస్తే హైదరాబాద్‌ ఐటీరంగం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. . ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

interview with Murali Kallu
లాక్​డౌన్​ తర్వాత ఐటీ కొలువుల పరిస్థితి ఏమిటంటే...

కరోనా ప్రభావం వల్ల ఇప్పటికే కొన్ని ఐటీ కంపెనీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకునే చర్యలు చేపట్టాయని, పదోన్నతులు వాయిదా వేసుకున్నాయని హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు మురళి బొల్లు తెలిపారు. ప్రస్తుతానికి ఐటీలో ఐదు శాతం లోపు ఉద్యోగాల కోత ఉండే అవకాశాలున్నాయని, కొవిడ్‌ ప్రభావం కొనసాగుతూ వెళ్తే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని వెల్లడించారు.

కరోనా ప్రభావాన్ని ఐటీ కంపెనీలు ఎలా ఎదుర్కొంటున్నాయి?

లాక్‌డౌన్‌తో ఐటీరంగంలో తొలిసారిగా 90-95 శాతం మంది ఉద్యోగులు రెండు వారాలుగా ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఐదుశాతం మంది కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేందుకు కంపెనీలు అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాయి. పలు కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు కసరత్తు మొదలుపెట్టాయి. ఉద్యోగులకు పదోన్నతులు, వేతన పెంపు నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశాయి.

‘ఇంటి నుంచి పని’ విధానంలో ఏమైనా సమస్యలు గుర్తించారా?

ఇంట్లో కూర్చునే సీటు సరిగా లేకపోవడంతో పలువురు ఉద్యోగులు వెన్నునొప్పి సమస్య ఎదుర్కొంటూ సెలవులు అడుగుతున్నట్లు గుర్తించాం. పలు పాఠశాలలు ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించడంతో ఇంట్లో ఇంటర్నెట్‌ వాడకం పెరిగింది. ఈ పరిస్థితితో ఒక్కోసారి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఆన్‌లైన్‌ సమావేశాలకు అప్పుడప్పుడు ఇంట్లో పిల్లలు, ఇతరుల మాటలు అంతరాయం కలిగిస్తున్నాయి. ప్రస్తుతానికి క్లయింట్లు పరిస్థితులు అర్థం చేసుకుని సావధానంగా ఉన్నా, సహనం కోల్పోతే సమస్యలు తప్పవు.

ప్రాజెక్టుల పొడిగింపు, ఒప్పందాలపై కొవిడ్‌ ప్రభావం ఎలా ఉంది?

వాస్తవానికి చెప్పాలంటే ఈ కాలం ఐటీ రంగానికి కీలక సమయం. ఇప్పుడే క్లయింట్లతో ఒప్పందాలు, పునరుద్ధరణ నిర్ణయాలు ఉంటాయి. అమెరికా వేగంగా కోలుకుంటే ప్రాజెక్టులు అలాగే కొనసాగుతాయి. లేకుంటే ఒప్పందాలు రద్దవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. గడువు ముగిసిన ఒప్పందాల పునరుద్ధరణపై కొవిడ్‌ ప్రభావం నెలకొంది.

ఐటీ ఉద్యోగాల్లో భారీగా కోత ఉంటుందని ప్రచారం జరుగుతోంది?

ఐటీ ప్రాజెక్టులు అమెరికా, బ్రిటన్‌ నుంచి ఎక్కువ. ఆయా దేశాల్లో వైరస్‌ అదుపులోకి వచ్చి సాధారణ పరిస్థితులు వేగంగా నెలకొంటే వ్యాపారం సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఇప్పుడే కచ్చితంగా చెప్పలేం. ఉద్యోగాల్లో కోతకు సంబంధించిన ప్రచారంపై ఐటీ కంపెనీల ప్రతినిధులను వివరాలు అడిగాం. ఇప్పటికైతే ఖర్చులు తగ్గించుకుంటున్నట్లు తెలిపారు. పెద్ద కంపెనీల్లో పనిచేస్తూ నైపుణ్యం కలిగిన వారి ఉద్యోగాలకు భవిష్యత్తులో ఎలాంటి ఢోకా ఉండదు.

నైపుణ్యం లేకుంటే ఇబ్బందులు తప్పవు. చిన్నతరహా కంపెనీల్లో వేతన కోతలు అమలవుతున్నాయి. వీటిల్లో 10 శాతం వరకు ఉద్యోగాల కోత ఏర్పడే పరిస్థితులు తలెత్తే ప్రమాదముంది. వేరే కంపెనీల్లోకి మారేందుకు ఇప్పటికే ఉద్యోగాలను వదిలేసేందుకు సిద్ధమైన నిపుణులు తమ రాజీనామాలు వెనక్కు తీసుకుంటున్నారు.

ఇదీ చూడండి:గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు : మంత్రి నిరంజన్​ రెడ్డి

Last Updated : Apr 10, 2020, 11:53 AM IST

ABOUT THE AUTHOR

...view details