తెలంగాణ

telangana

By

Published : May 2, 2021, 6:25 AM IST

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: ఆక్సిజన్​ సరఫరా లేక నష్టాల బాటలో పరిశ్రమలు

కరోనాతో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ఆక్సిజన్​ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉత్పత్తికి.. వ్యయానికి మధ్య అంతరాలు భారీగా పెరుగుతున్నాయి. కొవిడ్ చికిత్సలో ప్రాణాధారమైన ఆక్సిజన్ సరఫరా పరిశ్రమలకు నిలుపుదల చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవటం ఇంజినీరింగ్ పరిశ్రమకు శరాఘాతంగా మారిందని పారిశ్రామిక వేత్తలు వాపోతున్నారు.

పరిశ్రమలపై కరోనా ప్రభావం
పరిశ్రమలపై కరోనా ప్రభావం

పరిశ్రమలపై కరోనా ప్రభావం

ఆక్సిజన్.. సకల జీవరాశులకు ప్రాణవాయువే కాకుండా అనేక పరిశ్రమలకు ఆధారం. ముఖ్యంగా ఇనుము, ఉక్కు, రసాయన, రిఫైనరీలు, వెల్డింగ్, విద్యుద్దీకరణ పరిశ్రమలకు పెద్ద ఎత్తున ఆక్సిజన్ అవసరం. ప్రస్తుతం దేశవ్యాప్త కొవిడ్​ కల్లోలం కారణంగా బాధితులకు ఆక్సిజన్​ను భారీగా వినియోగించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. విదేశాల నుంచీ ప్రాణవాయువు దిగుమతి అవుతోంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక అవసరాలకు ఆక్సిజన్​ను వాడొద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆక్సిజన్ ఆధారిత ప్లాంట్లలో ఉత్పత్తయ్యే ప్రాణవాయువును అత్యవసరంగా ఆసుపత్రులకు తరలించాలని స్పష్టం చేసింది. ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా అనేక స్టీల్ ప్లాంట్ల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లు అవసరమైన ప్రాంతాలకు సర్దుబాటు చేస్తున్నారు.

పనులకు ఆటంకం..

ముఖ్యంగా స్టీల్, కటింగ్ అండ్ వెల్డింగ్, విద్యుత్ ప్లాంట్ల మరమ్మతు, భారీ స్థాయి యంత్రాల విడి భాగాల తయారీకి ఆక్సిజన్ ఎంతో కీలకం. చర్లపల్లి, పాశమైలారం, జీడిమెట్ల వంటి పారిశ్రామిక కారిడార్లలోని ఇంజినీరింగ్ పరిశ్రమలు ఆక్సిజన్ సరఫరా లేక ఆటో కంపోనెంట్స్ తయారీ పనులు నిలిచాయి. వలస కార్మికుల సమస్య.. అమ్మకాలు పడిపోవటం ఒకేసారి మీద పడ్డాయని యజమానులు వాపోతున్నారు.

కేంద్రం చర్యలు తీసుకోవాలి..

ప్రస్తుతం దేశంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పరిశ్రమలకు ఆక్సిజన్ అడగలేమని.. తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య స్పష్టం చేసింది. కేంద్రం దీర్ఘకాలిక ప్రణాళికలు, ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉత్పత్తి నిలిచిపోయిన పాశమైలారం, చర్లపల్లిలోని ఆక్సిజన్ ప్లాంట్లను పునరుద్ధరిస్తే మరింత సహకారం అందిస్తామని చెబుతోంది.

ఆక్సిజన్ ఉత్పత్తిని మరింత పెంచడం వల్ల ప్రజల ప్రాణాలు కాపాడటమే కాకుండా.. పారిశ్రామిక అవసరాలు తీరుతాయి. ప్రభుత్వం సహకరిస్తే కార్మికులకు ఉపాధి లభిస్తుందని చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి: 'ఒత్తిడి పెరుగుతుంటే... దృష్టి మళ్లించటం కేసీఆర్​కు అలవాటే'

ABOUT THE AUTHOR

...view details