తెలంగాణ

telangana

ETV Bharat / state

Respiratory diseases: ఒకవైపు చలి.. మరోవైపు శ్వాసకోశ వ్యాధులు.. - శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు

Winter diseases: అమ్మో చలి.. ఇది గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో వినిపిస్తోన్న మాటలు.. చలి అంటేనే జనాలు హడలిపోతున్నారు. ఎందుకంటే ఈ శీతాకాలంలో చల్లటి గాలులు కారణంగా చాలా మంది మంచాన పడుతున్నారు. ఈ చల్లటి గాలులు విజృంభిస్తున్న వేళ శ్వాస రుగ్మతలకు పెరిగిపోయాయి. వీటి దారిన పడుతున్న బాధితుల సంఖ్య సైతం నేటినేటికి పెరిగిపోతూ వస్తోంది. అలాగే వాతావరణం కాలుష్యంగా మారడం వంటివి ఈ రుగ్మతలకు దారితీస్తోంది. అయితే నిపుణులు చెప్పే సూత్రాలను పాటిస్తూ ఈ రుగ్మతలు దరిచేరకుండా చేసుకుందాం..

Respiratory diseases Increase
శ్వాస రుగ్మతలు

By

Published : Oct 28, 2022, 10:27 AM IST

Respiratory diseases Increase: రాష్ట్రంలో శ్వాస సంబంధిత సమస్యలు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకోవడం, చల్లని గాలుల తీవ్రత పెరగడం, కాలుష్యం అధికమవడంతో ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరవుతున్న బాధితుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. చలికాలంలో విషతుల్య రసాయనాలు కూడా గాలిలో ఉండిపోతుండడంతో.. జలుబు, గొంతునొప్పి, సైనసైటిస్‌, న్యుమోనియా, ఆస్తమా, క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌(సీవోపీడీ) తదితర శ్వాస కోశ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ నెల(అక్టోబరు)లో గడిచిన 25 రోజుల్లోనే 35,221 మంది అత్యవసర శ్వాస సమస్యలతో చికిత్స పొందగా.. గడిచిన 7 వారాల్లో వీరి సంఖ్య 83,195గా నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 9,60,908 మంది శ్వాస సమస్యలతో బాధపడినట్లుగా ప్రభుత్వ లెక్కలు వెల్లడిస్తున్నాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 1,85,979 మంది అత్యవసర శ్వాస సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. ఈ గణాంకాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రులకు చెందినవి. ప్రైవేటు ఆసుపత్రుల్లో శ్వాసకోశ సమస్యలతో చికిత్స పొందినవారి గణాంకాలు కూడా జత చేస్తే.. బాధితుల సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉంటుందని వైద్యులు అంచనా. బాధితుల్లో పిల్లలే అత్యధికం. కొంతమందిలో జలుబు తగ్గిపోయినా దగ్గు, గొంతునొప్పి వంటివి వారం రోజులు గడిచినా వేధిస్తూనే ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

స్వీయ జాగ్రత్తలు మేలు..

  • తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కు, నోటికి ఆచ్ఛాదన ఉండాలి.
  • తుమ్మిన, దగ్గిన అనంతరం ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
  • జలుబు ఉన్నవారు ఇంట్లో ఒక గదిలో విశ్రాంతి తీసుకోవడమే మేలు.
  • ఈ సమస్యలతో బాధపడుతున్నప్పుడు పిల్లల్ని పాఠశాలకు పంపించొద్దు.
  • వీరు వాడే చేతి రుమాలు, టవల్‌ వంటి వాటిని ఇతరులు వాడొద్దు.
  • గొంతునొప్పికి వైద్యులు సూచించిన మేరకు పూర్తి స్థాయి ఔషధాలను వాడాలి.
  • వేడి నీటితో ఆవిరిపట్టాలి.
  • చలికాలంలో బయటికెళ్లినప్పుడు ముక్కు, నోటికి ఆచ్ఛాదన ధరించాలి.
  • చల్లని పదార్థాలు, చల్లని నీళ్లు, ఫ్రిడ్జ్‌లో పెట్టిన పదార్థాలు తినకూడదు.
  • తాజా ఆహారాన్నే తీసుకోవాలి.
  • 48-72 గంటల వ్యవధిలో లక్షణాలు తగ్గుముఖం పట్టకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

జనవరిలోనే అత్యధికంగా..ఈ ఏడాది ప్రారంభంలో జనవరి ఒక్క నెలలోనే అత్యధికంగా రాష్ట్రం మొత్తం మీద 4,34,982 మంది బాధితులు అత్యవసర శ్వాసకోశ సమస్యలతో బాధపడగా.. ఫిబ్రవరిలోనూ 2,18,11 మంది చికిత్స పొందారు. ఆ తర్వాత వేసవి ప్రారంభం కావడంతో శ్వాస సమస్యలు క్రమేణా తగ్గుముఖం పట్టాయి. మార్చిలో 42,041.. ఏప్రిల్‌లో 27,625.. మేలో 29,085 మంది బాధితులు చికిత్స పొందారు. మళ్లీ వర్షాకాలం మొదలవగానే వాతావరణంలో మార్పుల ఫలితంగా జులైలో 45,124, ఆగస్టులో 46,877, సెప్టెంబరులో 47,974 కేసులు ప్రభుత్వ వైద్యంలో నమోదయ్యాయి.

వచ్చే రెండు నెలల్లో పెరగనున్న తీవ్రత..రానున్న రెండు మూడు నెలల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉండడంతో.. శ్వాసకోశ సమస్యలు తీవ్రమయ్యే అవకాశాలే అధికమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అయిదు సంవత్సరాలలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, గుండెజబ్బు, ఊపిరితిత్తుల సమస్యలున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

పిల్లల విషయంలో జాగ్రత్త..గత రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాదిలో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల బారినపడుతున్న బాధితుల సంఖ్య పెరిగింది. పిల్లల కదలికలను కట్టడి చేయడం కష్టం. వారు ఏవేవో ముట్టుకుంటారు. ఆ చేతులను తిరిగి ముక్కు దగ్గర పెడుతుంటారు. దీనివల్ల ఇన్‌ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తాయి. వీరిలో సాధారణ జలుబు, దగ్గు కూడా ఒక్కోసారి ప్రమాదకరంగా పరిణమించొచ్చు. వైరల్‌ జ్వరాలు కాస్తా బ్యాక్టీరియా కిందికి మారిపోతుంటాయి. ఫలితంగా అక్యూట్‌ బ్రాంకియోలైటీస్‌, బ్రాంకో న్యుమోనియా, అక్యూట్‌ ట్రాన్సిలైటీస్‌, నోటి చుట్టూ పొక్కులు రావడం వంటి సమస్యలు చుట్టుముడుతుంటాయి. ఆహారం ఏమీ తీసుకోకపోవడం, శ్వాసనాళాలు సంకోచించడంతో ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పిల్లి కూతలు, డొక్కలు ఎగరేయడం, కళ్లు తిరిగినట్లుగా అవడం, జ్వరం 102 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవడం, నీరసించిపోవడం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు అత్యవసర చికిత్స తీసుకోవాలి. సరైన సమయంలో చికిత్స ఇప్పించకపోతే న్యుమోనియాతో ప్రాణాపాయ పరిస్థితులు ఎదురుకావచ్చు. వాతావరణం చల్లగా ఉన్నా నీటిని తగు మోతాదులో తీసుకోవాల్సిందే. - డాక్టర్‌ జె.విజయానంద్‌, సీనియర్‌ పిల్లల వైద్యనిపుణులు, రెయిన్‌బో హాస్పిటల్‌

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details