తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ-బైక్​ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కి.మీ వెళ్లొచ్చు

విన్నూత్న ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తున్న ఐఐటీ హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక ఆవిష్కరణకు తెరలేపింది. పర్యావరణ హితమే లక్ష్యంగా... బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ-ఈవీ ఎనర్జీ అంకురం సంస్థతో అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక సాంకేతికతతో శక్తివంతమైన బ్యాటరీ ద్విచక్ర వాహనాలు తీసుకొచ్చింది.

By

Published : Apr 29, 2019, 4:21 PM IST

మార్కెట్​లోకి ఛార్జింగ్ బైక్స్

పర్యావరణ హితం, కాలుష్య నియంత్రణే ప్రధాన లక్ష్యంగా ఐఐటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో యువ శాస్త్రవేత్త డాక్టర్ నిశాంత్ ప్యూర్ ఎనర్జీ అంకుర సంస్థను స్థాపించారు. అత్యాధునిక సౌర విద్యుత్ పలకలు, హైబ్రిడ్ సరఫరా వ్యవస్థను తయారు చేసిన ఈయన... అత్యాధునిక సాంకేతికత, రాజీలేని ప్రదర్శన ఇచ్చే ఛార్జింగ్ సైకిళ్లు, బైకులు తయారు చేయడానికి ప్యూర్ ఈవీ పేరుతో మరో అంకుర సంస్థని నెలకొల్పారు.

మార్కెట్​లోకి ఛార్జింగ్ బైక్స్

ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 120 కి.మీ
యువతతో పాటు అన్నీ వర్గాల అవసరాలకు అనుగుణంగా ఈ- ఫ్లూటో పేరుతో ద్విచక్ర వాహనాన్ని తయారు చేశారు. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే నిరంతరాయంగా 120కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా డిజైన్ చేశారు. వేగంలోనూ రాజీలేని విధంగా దీన్ని తీర్చిదిద్దారు. ఆకర్షణీయ రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చామని ప్యూర్ ఎనర్జీ అంకుర వ్యవస్థాపకులు నిశాంత్ తెలిపారు. పురుషులు, మహిళలు ఎవరైనా నడిపేలా ఈ-ట్రాన్స్ పేరుతో ఓ స్కూటర్​ను రూపొందించినట్లు వెల్లడించారు. 45కేజీల బరువు మాత్రమే ఉండటం ఈ స్కూటర్ ప్రత్యేకత. ఇగ్నైట్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన సైకిల్ 20 డిగ్రీల కోణంలో కొండలు సైతం ఎక్కేలా డిజైన్ చేసినట్లు వెల్లడించారు.

లిథియం బ్యాటరీల తయారీ...
ఛార్జింగ్ వాహనాలపై ప్రజల్లో ఉన్న అపోహలను పోగొట్టి మార్కెట్లో సత్తా చాటేవిధంగా సాంకేతికతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఐఐటీ హైదరాబాద్ కు అనుబంధంగా 18000 చదరపు గజాల విస్తీర్ణంలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పారు. ఛార్జింగ్ వాహనాలకు అత్యంత కీలకమైన లిథియం బ్యాటరీలపై పరిశోధనలు చేసి దాని సామర్థ్యాలు అభివృద్ధి చేశామని సీఈవో రోహిత్ వాద్రా తెలిపారు. ఇతర సంస్థలకు భిన్నంగా సొంతంగా బ్యాటరీలను తయారు చేసి వాహనాలకు అమర్చుతున్నారు.
మార్కెట్లో ఈ ద్విచక్రవాహనాల వినియోగాన్ని విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తూ ప్యూర్ ఎనర్జీ సంస్థ ముందుకు సాగుతోంది. సామర్థ్యాలు పరిశీలించిన తర్వాతే డీలర్ షిప్ ఇస్తున్నారు. ఎంపిక చేసుకున్న డీలర్లకు ఐఐటీ హైదరాబాద్​లోని టెక్నాలజీ సెంటర్​లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ ఆటో ఎక్స్​పో లలో పాల్గొని తమ సత్తా చాటుతున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో పది వేల వాహనాల అమ్మకాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు మార్కెటింగ్ ప్రతినిధులు తెలిపారు. సాంకేతికతే దన్నుగా, అవకాశాలను అందిపుచ్చుకుంటూ, కొత్త ఆవిష్కరణలతో ముందుకు దూసుకెళ్తూ... మార్కెట్​ను సొంత చేసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది ఈ యువ బృందం.

ఇవీ చూడండి: ఖేల్​రత్నకు వినేశ్, పూనియా పేర్లు సిఫార్సు!

ABOUT THE AUTHOR

...view details