కరోనా వల్ల రవాణా, పర్యాటక రంగాలు దెబ్బతిన్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు చర్యలు చేపడతానని పేర్కొన్నారు. ఆర్టీసీ అభివృద్ధి విషయమై అధ్యయనం చేపడతామని తెలిపారు. ఆర్టీసీ అభివృద్ధిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని వెల్లడించారు. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. బస్ భవన్లో వేద పండితుల ఆశీర్వచనాలతో ఆయన విధులు చేపట్టారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఆర్టీసీకి చాలా ఏళ్లుగా ప్రభుత్వం సహకారం అందిస్తోందని సజ్జనార్ తెలిపారు. ప్రభుత్వానికి భారం కాకుండా సొంతంగా నిలబడేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీ ప్రయాణికులు సంతృప్తి చెందేలా సేవలందిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని... సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఆర్టీసీ స్వావలంబనే లక్ష్యంగా ముందుకెళ్తామని సజ్జనార్ పేర్కొన్నారు. 90 ఏళ్ల చరిత్ర ఉన్న ఆర్టీసీ ప్రస్తుత స్థితిగతులపై అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో పని చేసినప్పుడు... ఎంతో మంది ఆర్టీసీ అధికారులతో కలిసిమెలిసి ఉన్నట్లు సజ్జనార్ పేర్కొన్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు సంస్థకు ఆర్థికంగా నష్టం చేకూరుస్తున్నాయని... ప్రతి రోజు 7 కోట్ల నష్టం వస్తోందని తెలిపారు. ఆర్టీసీ ప్రైవేటు పరం కాదన్న ఆయన... ఆదాయాన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకుందని... కరోనా సమయంలో ఇతర రాష్టాల్లో ఉద్యోగుల జీతాలు కట్ చేసినప్పటికీ, తెలంగాణలో పూర్తి జీతాలు అందాయన్నారు. ఆర్టీసీని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు.