తెలంగాణ

telangana

By

Published : Oct 18, 2020, 5:49 AM IST

ETV Bharat / state

హైదరాబాద్​ను మళ్లీ ముంచెత్తిన వరద.. ప్రజలకు తప్పని అవస్థలు

హైదరాబాద్‌ను వరుణగండం వెంటాడుతోంది. కుంభవృష్టి నుంచి మహానగరం కోలుకోక ముందే మరోసారి వర్షం హడలెత్తించింది. వరద గుప్పిట నుంచి బయటపడకుందే.. క్యుములోనింబస్‌ మేఘాల రూపంలో మరోసారి విరుచుకుపడిన వాన నగరవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. లోతట్టు ప్రాంతాలు, కాలనీలను వరద వణికించింది. ఏరులైన పారిన వరదతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ స్తంభించి వాహనాదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.

హైదరాబాద్​ను మళ్లీ ముంచెత్తిన వరద.. ప్రజలకు తప్పని అవస్థలు
హైదరాబాద్​ను మళ్లీ ముంచెత్తిన వరద.. ప్రజలకు తప్పని అవస్థలు

హైదరాబాద్‌ మహానగరంలో వర్షం బీభత్సం ఇంకా కళ్లముందే మెదులుతోంది. రికార్డుస్థాయిలో కురిసిన వానలతో అనేక కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. తెరిపినిచ్చిన వానలతో పరిస్థితులు కుదుపడుతున్న తరుణంలో మరోసారి వరుణుడు పంజా విసిరాడు. క్యుములో నింబస్‌ మేఘాల రూపంలో మరోసారి నగరవాసిని వణికించాడు.

గోడ కూలి ఆరేళ్ల బాలిక మృతి..

పాతబస్తీ పరిధిలో మళ్లీ వర్షం ముంచెత్తింది. అల్‌జుబెర్‌ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరదలతో ఇప్పటికే సర్వం కోల్పోయిన కాలనీవాసులు జోరువానతో అల్లాడిపోయారు. పాతబస్తీలోని బాబానగర్‌లో గుర్రం చెరువు కట్ట తెగి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఉప్పగూడ, సాయిబాబా నగర్‌, శివాజీనగర్‌, బాబా నగర్‌ బస్తీలను వరద ముంచెత్తింది. ఓల్డ్ మలక్ పేటలోని యశోదా ఆసుపత్రి సమీపంలో ఓ వ్యక్తి ఫుట్ పాత్ వెంబడి నడుచుకుంటూ విద్యుత్ స్తంభాన్ని పట్టుకోవటం వల్ల విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే మృతి చెందాడు. మలక్‌పేట రైల్వే వంతెన కింద భారీగా నిలిచిన వరదతో అనేక వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి పైభాగంలో భారీ గొయ్యి పడటం వల్ల వంతెనను మూసేశారు. మంగళ్‌హాట్‌ పరిధిలోని ఆర్‌కే పేట్‌లో వర్షానికి గోడ కూలి ఆరేళ్ల బాలిక మృతి చెందింది.

నేలకొరిగిన విద్యుత్​ సరఫరా

కాచిగూడ, నల్లకుంట, తార్నాక, ఎర్రగడ్డ, ముషీరాబాద్, సికింద్రాబాద్‌లోనూ వర్షం పోటెత్తింది. మల్కాజ్ గిరి, లోని బన్సీలాల్‌పేట, నాచారం, అంబర్పేట్ వంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. పలు అపార్ట్ మెంట్లలో ముందు జాగ్రత్తగా లిఫ్టులు ఆపేశారు. నిజాంకాలనీ, టోలీచౌకీలో వరద ఉద్ధృతితో ప్రజలు అల్లాడిపోయారు. అనేక వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. సికింద్రాబాద్ డివిజన్ అరుంధతినగర్ లో విద్యుతాఘాతంతో ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. పలు చోట్ల చెట్లు నేలకొరిగి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

రోడ్లపై వరద ప్రవాహం..

మాదాపూర్, నానక్ రాంగూడ, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో జోరు వర్షం కురిసింది. ఎల్బీనగర్‌ పరిధిలోని కాలనీల్లోకి మరోసారి వరద ముంచెత్తింది. వనస్థలిపురంలోని ప్రశాంతినగర్‌, గాంధీనగర్‌ సహా పలుకాలనీల్లో ప్రవాహం పోటెత్తింది. ఆర్కేపురం డివిజన్‌లోని ఎన్టీఆర్‌నగర్‌ వీధులు చెరువులను తలపించాయి. బీన్‌రెడ్డినగర్‌లో భారీవర్షంతో కాలనీల రోడ్లపై ప్రవాహం పొంగిపొర్లింది. సరూర్‌నగర్‌ పరిధిలోనూ కాలనీలు, లోతట్టు ప్రాంతాలు మళ్లీ వరద గుప్పిట్లోకి వెళ్లాయి. చింతలకుంట, పనామా చౌరస్తాల్లోని రోడ్లపై వరద పారింది. చైత్యనపురి కమలనగర్ రోడ్డు నెంబర్ 5 లో వరదలో కొట్టుకుపోతున్న నలుగురిని కాలనీవాసులు కాపాడారు.

హయత్‌నగర్‌ పరిధిలోని కాలనీల్లోనూ వరద బీభత్సం కొనసాగింది. ఎక్కడికక్కడ వాన ప్రవాహం ముంచెత్తింది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం మజీద్ పూర్ వద్ద వరదనీటిలో కారు చిక్కుకుపోయింది. స్థానికులు, పోలీసుల సహాయంతో కారులో ప్రయాణిస్తున్నవారిని బయటకు తీశారు. ఉప్పల్‌ పరిధిలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో వరద ఏరులైపారింది. మల్లాపూర్‌ మిలినీయం క్వార్టర్స్ లోకి నీళ్లు వచ్చాయి. చంపాపేట్‌ చౌరస్తా పూర్తిగా వరద నీటితో నిండిపోయింది.

ఇదీ చదవండి:వరదతో ట్రాఫిక్​ జామ్​.. ఈత కొట్టుకుంటూ వెళ్లిన వ్యక్తి..

ABOUT THE AUTHOR

...view details