తెలంగాణ

telangana

ETV Bharat / state

పునఃప్రారంభమైన మెట్రో సేవలు.. ఆ రెండు చోట్ల మాత్రం ఆగవు - hyderabad metro restarted

జనతా కర్ఫ్యూ రోజున నిలిపివేసిన హైదరాబాద్​ మెట్రో రైళ్లు 169 రోజుల తర్వాత మళ్లీ సోమవారం పట్టాలెక్కాయి. తొలుత కారిడార్‌-1 మియాపూర్‌-ఎల్‌బీనగర్‌ మార్గంలో మెట్రో పరుగులు తీసింది. ప్రతి రైలును పరీక్షించి కొవిడ్‌ రక్షణ ఏర్పాట్లతో అధికారులు సిద్ధం చేశారు. ఏసీ ప్రయాణం కావడంతో 75 శాతం వరకు తాజా గాలి ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

hyderabad metro corridor 1 services restarted
పునఃప్రారంభమైన మెట్రో సేవలు.. ఆ రెండు చోట్ల మాత్రం ఆగవు

By

Published : Sep 7, 2020, 8:41 AM IST

సుదీర్ఘ కాలం తర్వాత మెట్రోరైలు సేవలు ప్రారంభమయ్యాయి. తొలుత కారిడార్‌-1 మియాపూర్‌-ఎల్‌బీనగర్‌ మార్గంలో మెట్రో పరుగులు పెడుతోంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 మధ్య రైళ్లను నడుపుతారు. 27 స్టేషన్లు ఉండగా..కంటెయిన్‌మెంట్‌ జోన్‌లో ఉన్న మూసాపేట, భరత్‌నగర్‌ తప్ప మిగతావి అందుబాటులో ఉంటాయి. ప్రతి 5 నిమిషాలకు ఒక రైలు నడుస్తుంది.

ఎడం పాటించేలా మార్కింగ్‌లు

మెట్రో రైళ్లు మార్చి 22న జనతా కర్ఫ్యూ రోజున ఆగిపోయాయి. 169 రోజుల తర్వాత ప్రస్తుతం వీటిని పట్టాలెక్కించారు. ప్రతి రైలును పరీక్షించి కొవిడ్‌ రక్షణ ఏర్పాట్లతో సిద్ధం చేశారు. బస్సులు, ఎంఎంటీఎస్‌ వంటి ప్రజారవాణా లేక ఇన్నాళ్లు ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు మెట్రో రావడం కొంత ఊరట. అయితే అన్నీ ఒకేసారి కాకుండా ఒక కారిడార్‌తో మొదలెట్టి మూడురోజుల్లో మూడు మార్గాల్లోనూ తిప్పనున్నారు. సోమవారం ప్రారంభించే కారిడార్‌-1లో స్టేషన్లను ఇప్పటికే శుభ్రం చేశారు. ఏసీ ప్రయాణం కావడంతో 75 శాతం వరకు తాజా గాలి ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

ఎంజీబీఎస్‌కు సులభం

ఎంజీబీఎస్‌కు చేరుకునేందుకు సిటీ బస్సులు లేక ప్రైవేట్‌ వాహనాలకు వందల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఇలాంటివారికి భారం తగ్గనుంది. తొలిరోజు ప్రారంభమయ్యే మార్గంలో ఎంజీబీఎస్‌ స్టేషన్‌ కూడా ఉంది.

మంగళ, బుధవారాల్లో

మంగళవారం కారిడార్‌-1తో పాటు కారిడార్‌-3లోని నాగోల్‌-రాయదుర్గం వరకు రైళ్లను ఉదయం 7-12, సాయంత్రం 4-9 గంటల వరకు నడుపుతారు. బుధవారం నుంచి మూడు మార్గాల్లోనూ రైళ్లు ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details