తెలంగాణ

telangana

పద్దు: కేటాయింపులపై మహా నగరం ఆశలు

By

Published : Mar 8, 2020, 9:51 AM IST

రాజధాని నగరం రాష్ట్ర బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. వివిధ శాఖల నుంచి వెళ్లిన ప్రతిపాదనలకు సంబంధించి ఇవాళ ప్రవేశపెట్టే పద్దులో తగు కేటాయింపులు ఉంటాయని ఆశిస్తోంది. భాగ్యనగరం నలుచెరుగులా విస్తరిస్తోన్న వేళ ఇప్పటికే చేపట్టిన వివిధ ప్రాజెక్టులు పూర్తికావాలంటే దండిగా నిధులు అవసరం.

hyderabad hopes on ts budget allocations
పద్దు: కేటాయింపులపై మహా నగరం ఆశలు

బల్దియా.. ఏం ఆశిస్తుందంటే.. నిధుల్లేక పీకల్లోతు కష్టాల్లో ఉన్న జీహెచ్‌ఎంసీ ఎప్పటిలాగే అంశాల వారీగా తనకు రావాల్సిన రూ.2,325 కోట్లు అందించాలని కోరింది. చిన్నపాటి పనులు పూర్తయితే మూడు నెలల్లో 50వేల రెండు పడకల గదుల ఇళ్లు అందుబాటులోకి వస్తాయని, అందుకు రూ.1,300కోట్ల కేటాయింపు ఉండాలని అధికారులు కోరారు.

తలకు మించిన భారమై.. జీహెచ్‌ఎంసీ వార్షికాదాయం రూ.3వేల కోట్లు కాగా ఇక్కడ ఎస్‌ఆర్‌డీపీ(వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం) కింద జరుగుతోన్న పైవంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణ విలువే రూ.3వేల కోట్లుగా ఉంది. మరో రూ.2వేల కోట్ల పనులు ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. భూసేకరణకు రూ.600కోట్లు కావాలి. ఎస్‌ఆర్‌డీపీ కోసం టర్మ్‌లోన్‌ రూపంలో తీసుకున్న రూ.2,500 కోట్లు, బాండ్ల జారీ ద్వారా సమీకరించిన రూ.395కోట్లకు వడ్డీ చెల్లించలేక అధికారులు తలపట్టుకుంటున్నారు.

నీటి ప్రాజెక్టులు ముందుకెళ్లాలంటే.. ఈసారి బడ్జెట్‌లో రూ.2175 కోట్ల నిధుల కోసం జలమండలి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ఈ సంస్థ నీటి సరఫరా చేసే ప్రాంతం 1415.91 చదరపు కిలోమీటర్ల పరిధి వరకు విస్తరించింది. రోజూ 460 మిలియన్‌ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్‌ నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేశవాపూర్‌ వద్ద నిర్మించనున్న 5 టీఎంసీల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు రూ.4700 కోట్లు అవసరమని అంచనా. రింగ్‌ రోడ్డు చుట్టూ 3000 ఎంఎం డయా వ్యాసార్థంతో భారీ గొట్టపు మార్గం(రింగ్‌మెయిన్‌), 12 ప్రాంతాల్లో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లు నిర్మిస్తారు. ఇప్పటికే 43 కి.మీ. మేరకు తొలి దశ పూర్తి చేశారు.

ఇవీ చూడండి :రెండో రోజు వాడీవేడిగా చర్చ.. ఆరుగురు కాంగ్రెస్​ సభ్యుల సస్పెషన్

ABOUT THE AUTHOR

...view details