హైదరాబాద్ ఖైరతాబాద్కు చెందిన ఓ కరోనా బాధితుడికి వైరస్ పాజిటివ్ వచ్చినా ఫోన్ వైద్యసాయం అందలేదు. దిక్కుతోచని స్థితిలో ప్రైవేటు ఆసుపత్రిలో చేరితే రూ.3 లక్షలు ఖర్చయిందని ఆందోళన వ్యక్తం చేశాడు. కూకట్పల్లిలో నివసించే ఓ ప్రైవేటు ఉద్యోగికి కరోనా సోకింది. ఇంట్లోనే ఉన్నాడు. వైద్య ఆరోగ్య శాఖ నుంచి మూడు రోజులైనా ఫోన్ రాలేదు. వైద్యసాయం అందలేదు. మూడో రోజు తన కుటుంబీకులు ముగ్గురికి వైరస్ వ్యాపించింది. భయపడి తనంతటతానే ఛాతీ ఆసుపత్రికి వెళ్లి వైద్యసాయం పొందారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటివరకు 16 వేలకు పైబడి కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో యాక్టివ్ కేసులు 9 వేల వరకు ఉన్నాయి. 5 వేల మందికిపైగా బాధితులు ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారు. పాజిటివ్ వచ్చిన వారి వివరాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు చేరుతున్నాయి. జాబితా అందగానే జిల్లా సర్వైలెన్సు అధికారి పర్యవేక్షణలోని వైద్య బృందం బాధితులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయాలి. తక్కువ లక్షణాలుంటే ఇంట్లోనే ఉండమని సూచించి ఔషధ సామగ్రి అందించాలి. కొన్నిసార్లు రోగుల జాబితా ఆలస్యంగా అందడం, సకాలంలో అందినా తక్షణ వైద్య సాయం చేయడంలో జాప్యం చేస్తున్నారని, కిట్లను పంపించడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు.
రోజువారీ పరిశీలన ఏదీ?
హోం ఐసోలేషన్లో ఉండే కరోనా బాధితుల ఇళ్లకు రోజూ ఆశా వర్కర్లు వెళ్లాలి. ఆరోగ్యం గురించి ఆరాతీయడంతోపాటు పూర్తిస్థాయి భరోసా కల్పించాలి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ భరోసా కొరవడుతోంది. అధికారుల నుంచి ఫోన్లు వెళ్లడంలేదు. మనో ధైర్యం ఇవ్వడంలేదు. దీనివల్ల ఆరోగ్య పరిస్థితి విషమించినా ఆ సమాచారం సకాలంలో అధికారులకు రావడంలేదు.