తెలంగాణ

telangana

ETV Bharat / state

రెవెన్యూలో అక్రమాలకు అడ్డుకట్ట పడేదెలా? - Corruption in the telangana State Revenue Department

భూ యాజమాన్య హక్కుల బదిలీని.. చట్టంలో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు రెవెన్యూ అధికారులు రూ.లక్షలు భోంచేస్తున్నారు. స్థిరాస్తి ధరలు భారీగా పలుకుతున్న చోట అంతేస్థాయిలో భారీ మొత్తాలను డిమాండ్‌ చేస్తున్నారు. దస్త్రానికో ధర కడుతున్న అక్రమాలు అనిశా దాడులతో బయటపడుతున్నాయి.

how can we stop the Corruption in telangana State Revenue Department
రెవెన్యూలో అక్రమాలకు అడ్డుకట్ట పడేదెలా?

By

Published : Jun 8, 2020, 6:39 AM IST

భూ యాజమాన్య హక్కుల బదిలీల్లో లంచాల పర్వం ఆగట్లేదు. కొత్త పాసుపుస్తకాల పంపిణీలో క్షేత్ర స్థాయి రెవెన్యూ సిబ్బంది వసూళ్లకు పాల్పడ్డారని, రెవెన్యూశాఖ ప్రక్షాళన తప్పదంటూ ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. అయినా ఆ శాఖలోని కొందరి తీరు మారకపోగా.. అక్రమ వసూళ్లతో ప్రజలను పీడిస్తూనే ఉన్నారు.

పారదర్శకత లోపమే శాపం..

రెవెన్యూ శాఖలో అక్రమాలకు బీజం వేస్తోంది పారదర్శక వ్యవస్థ లేకపోవడమే. యాజమాన్య హక్కుల విషయంలో క్షేత్రస్థాయి సిబ్బందిదే అన్నిచోట్లా ఆధిపత్యం. మ్యుటేషన్‌ ప్రక్రియకు నిర్దుష్టమైన గడువు ఉన్నా చాలాచోట్ల వివిధ కారణాలతో దస్త్రాలు కదలడం లేదు. వారసత్వ బదిలీ, తప్పిపోయిన సర్వే నంబర్లు చేర్చడం, కొత్త పాసుపుస్తకాల జారీ తదితర ప్రక్రియల్లో లోపాయికారీగా ఆమ్యామ్యా అందనిదే పలు జిల్లాలు, మండలాల్లో దస్త్రం కదలడం లేదన్న ఆరోపణలున్నాయి.

ఒక పత్రం పొందాలని దరఖాస్తు చేసుకున్న భూయజమానికి తన పని ఎంతవరకూ వచ్చిందో తెలిపే ట్రాకింగ్‌ వ్యవస్థ లేకపోవడం వల్ల నయానో భయానో ఇచ్చి పని పూర్తి చేయించుకునేందుకు ఆరాటపడుతున్నారు. స్థిరాస్తి వ్యాపారం జోరు ఉన్నచోట కొందరు వ్యాపారులు అక్రమ పద్ధతులకు తెర తీస్తున్నారు. ‘ధరణి’ పేరుతో కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా 2018 నుంచి అమల్లోకి రావడమే లేదు. ఆన్‌లైన్‌లో సర్వే, ఖాతా నంబర్లు లేని రైతులు ఇప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

పోస్టింగుల నుంచే మొదలు

భూముల ధరలు రూ.కోట్లు పలుకుతున్న హైదరాబాద్‌ చుట్టూ ఉన్న జిల్లాల్లో నిబంధనలకు విరుద్ధంగా సుదీర్ఘకాలంగా కొందరు పక్కపక్క స్థానాల్లోనే పోస్టింగుల్లో కొనసాగుతున్నారు. రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో ఇలా ఏళ్ల తరబడి పనిచేస్తున్నవారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు మార్చాలనే ఫిర్యాదులు ఇప్పటికే ప్రభుత్వానికి అందాయి. కీలకమైన స్థానాల్లో తమకు కావాల్సిన వారికి పోస్టింగ్‌లు ఇప్పించుకుంటున్న తీరు ఉందని, గ్రామాల్లో పనిచేసే వారికి అర్బన్‌లో అవకాశం ఇవ్వాలని, ఎక్కువ కాలం నగరాలు, పట్టణాల్లో పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని రెవెన్యూ సంఘాలు కొన్ని నెలల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశాయి.

12.07.2019: రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దారు లావణ్య వద్ద అనిశా రూ.93 లక్షల భారీమొత్తం స్వాధీనం చేసుకుంది. వీఆర్వో అనంతయ్య రూ.8 లక్షలు డిమాండ్‌ చేసి పట్టుపడ్డారు.

25.02.2020: నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టరేట్‌ సెక్షన్‌ అధికారి జ్యోతి రూ.13 లక్షల లంచం డిమాండ్‌ చేసి చిక్కారు.

06.06.2020: హైదరాబాద్‌ జిల్లా షేక్‌పేట తహసీల్దారు కార్యాలయం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ నాగార్జున రూ.30 లక్షలు డిమాండ్‌ చేసి రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికారు.

ABOUT THE AUTHOR

...view details