తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్ల విస్తరణ పేరుతో కడపలో కూల్చివేతలు.. ఇదెక్కడి దారుణం

Houses Demolished in Kadapa District: రూపాయి రూపాయి కూడబెట్టి మూడు దశాబ్దాల కిందట పేదలు నిర్మించుకున్న ఇళ్లను రోడ్డు విస్తరణ పేరుతో నిర్ధాక్షిణ్యంగా నేలమట్టం చేశారు. బస్సులు, పెద్ద వాహనాలేవీ తిరగని రోడ్డును వంద అడుగుల వెడల్పు చేయాలంటూ నిరుపేదల ఆవాసాలు కూలగొట్టారు. నాలుగైదు రోజులుగా సాగుతున్న కూల్చివేతలతో ఏపీలోని కడప మాసాపేటలోని పేదలు, ఎస్సీలు గూడు కోల్పోయారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఏమిటీ దారుణం అంటూ బాధితులు వాపోతున్నారు.

By

Published : Nov 26, 2022, 8:14 PM IST

Houses Demolished
కడపలో ఇళ్లు కూల్చివేత

కడపలో ఇళ్లు కూల్చివేత

Houses Demolished in Kadapa District: రోడ్ల విస్తరణ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కడప నగరపాలిక పరిధిలో పేదల ఇళ్ల కూల్చివేత నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. రెండు నెలల నుంచి ఇదే పనిలో ఉన్న అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఇప్పుడు మాసాపేటపై గురిపెట్టారు. నాలుగైదు రోజుల నుంచి రోడ్డుకు ఇరువైపుల ఉన్న పేదల ఇళ్లను జేసీబీలతో కూల్చివేస్తున్నారు. సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా శుక్రవారం చాలా ఇళ్లు పడగొట్టారు. ఈ ప్రాంతంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు మినహా ఎలాంటి పెద్ద వాహనాలు తిరగడం లేదు. కనీసం ఆర్టీసీ బస్సులు కూడా రావు. అయినా మాసాపేట రహదారిని 80 నుంచి 100 అడుగుల మేర విస్తరణ చేయాలంటూ ఇళ్లను కూల్చివేశారు. ప్రభుత్వ భూమిలో ఇళ్లు నిర్మించుకున్నారంటూ.. ఏళ్ల తరబడి ఉంటున్న ఆవాసాలు కూల్చివేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

"మేము తరాల తరబడి ఇక్కడే ఉంటున్నాము. మా నాన్న ఇళ్లు కట్టుకోలేని పరిస్థితి ఉంటే.. నేను కువైట్​ వెళ్లి అక్కడ పని చేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఇళ్లు కట్టుకున్నాము. ఇప్పుడు ఇల్లు కూల్చటంతో ఎక్కడకి వెళ్లి తల దాచుకోవాలి. నాకు పెళ్లై చిన్న పాప ఉంది." - బాధితుడు

మాసాపేట కాలనీలో ఎక్కువగా ఎస్సీలు నివాసం ఉంటున్నారు. మాటమాత్రమైనా చెప్పకుండా వారి ఇళ్లను నగరపాలక అధికారులు కూల్చివేశారు. ఇళ్లలోని సామాన్లు తీసుకునే సమయం ఇవ్వకుండానే పొక్లెయిన్లతో ధ్వంసం చేశారు. సమయం ఇవ్వాలని కాళ్లావేళ్లాపడినా కనికరించలేదు. ఎలాంటి వాహనాలు తిరగని ప్రదేశం, ట్రాఫిక్ లేని ప్రాంతానికి 100 అడుగుల రోడ్డు ఎవరికోసమో చెప్పాలంటున్నారు.

నగరంలో ప్రధాన రహదారులు ఇరుకుగా ఉన్నా పట్టించుకోని అధికారులు.. వాహనాలే తిరగని చోట రోడ్డు వెడల్పు చేయడం ఎవరికోసమని ప్రశ్నించారు. ఇళ్ల కూల్చివేయడం వల్ల.. చంటిబిడ్డలు, వృద్ధులతో సహా రోడ్డున పడ్డామని వాపోయారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా ఇళ్లు కూలదోస్తే ఎక్కడికి వెళ్లి బతకాలని నిలదీస్తున్నారు. ఇళ్ల కూల్చివేతలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ప్రతిపక్ష నేతలు కలెక్టర్​ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

"ఇప్పుడు వచ్చి ఇళ్లు కూల్చివేయటంతో మేము రోడ్డున పడ్డాము. మాకు ఏ ఆధారం లేదు. ఈ రోడ్డుపై బస్సులు రావు. బైకులు తప్ప ఇక్కడ ఏమి తిరగవు. అలాంటి ఈ రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చి వేస్తున్నారు." - బాధితురాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details