కరోనా నియంత్రణకు లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో గృహహింస, మహిళలపై వేధింపులు పెరిగిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు వదిలి బయటికి రాలేని వందల మంది హెల్ప్లైన్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తున్నారు. ఎవరికి.. ఎలా.. చెప్పుకోవాలో తెలియక బాధను గుండె లోతుల్లో, కోపాన్ని పంటి బిగువన దాచుకొని మిన్నకుండిపోయేవారు వేలల్లో ఉంటున్నారు. అవగాహన ఉన్నవారు మాత్రమే ప్రభుత్వ హెల్ప్లైన్ నెంబరు 181కు ఫోన్ చేస్తున్నారు.
- నా భర్తకు రోజూ మద్యం తాగే అలవాటు ఉంది. లాక్డౌన్తో కొన్ని రోజులు బ్లాక్లో మందు కొన్నారు. వారం రోజులుగా దొరకడం లేదు. దీంతో ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. మందు కావాలని, డబ్బులు ఇవ్వమని నన్నూ... పిల్లలను కొడుతున్నారు.
- లాక్డౌన్తో మా ఆయన, ఇద్దరు పిల్లలు, మా మామయ్య ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఇంటి పనంతా ఒక్కదాన్నే చేయాల్సి వస్తోంది. ఆఫీసుకు వెళ్లేటప్పుడు పని సాయం చేసే మా ఆయన ఇప్పుడు పట్టించుకోవడం లేదు. కనీసం పిల్లలనూ చూడటంలేదు. ఏదైనా పని చెబితే కోప్పడుతున్నారు. పనంతా చేయలేక ఏడుపొస్తోంది.
- లాక్డౌన్ ముందు రోజుకు సగటున 500 కాల్స్ రాగా.. తర్వాత 20 శాతం పెరిగాయి. మార్చి 22 నుంచి 31వ తేదీ వరకు పది రోజుల్లో ప్రతిరోజూ సుమారు 580 మంది సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం ఫోన్ చేశారు.