తెలంగాణ

telangana

వక్ఫ్​బోర్డు సీఈఓకు చట్టాలపై అవగాహనలేదు.. ఆయన అవసరమా?

By

Published : Nov 16, 2020, 7:35 PM IST

ముస్లిం శ్మశానాలు, ఇతర వక్ఫ్‌ ఆస్తుల ఆక్రమణలపై హైకోర్టులో విచారణ జరిగింది. వక్ఫ్ ఆస్తుల కబ్జాలపై పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని వక్ఫ్​ బోర్డు సీఈఓ ఖాసిం వివరణ ఇచ్చారు. దీనిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో విఫలమైన సీఈఓపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

telangana high court
telangana high court

వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో విఫలమైన వక్ఫ్ బోర్డు సీఈఓ మహమ్మద్ ఖాసింపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వక్ఫ్ బోర్డు సీఈఓ ఆక్రమణదారులతో చేతులు కలిపినట్లుగా ఉందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. చట్టాలపై కనీస అవగాహన లేని ఖాసిం.. వక్ఫ్ బోర్డు సీఈఓ పదవిలో ఉండటం ఎందుకని సూటిగా ప్రశ్నించింది. ముస్లిం శ్మశాన వాటికలు, ఇతర వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలకు సంబంధించిన మూడు ప్రజా ప్రయోజనాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.

కేవలం ఐదు కేసులే...

గత ఆదేశాల మేరకు హైకోర్టుకు వివరణ ఇచ్చేందుకు వక్ఫ్ బోర్డు సీఈఓ మహ్మద్ ఖాసిం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఇప్పటి వరకు 85 వక్ఫ్ ఆస్తులు కబ్జాకు గురైతే కేవలం ఐదు కేసులే ఎందుకు నమోదు చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. వక్ఫ్ ఆస్తుల కబ్జాపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారని.. సివిల్ వివాదమని అంటున్నారని ఖాసిం వివరించారు. పోలీస్ స్టేషన్​లో నిరాకరిస్తే చేతులెత్తేస్తారా.. ఎస్పీని, ఇతర ఉన్నతాధికారులు, సివిల్ కోర్టు లేదా హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని.. కనీసం న్యాయవాదిని సంప్రదించారా అని ప్రశ్నల వర్షం కురిపించింది.

రెండు వారాల్లో నివేదిక

చట్టాలు, ఫిర్యాదుల ప్రక్రియపై కనీస అవగాహన లేని అధికారులను సాగనంపాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. వక్ఫ్ ఆస్తుల ఆక్రమణలపై పూర్తి విచారణ జరిపి రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అదేవిధంగా వక్ఫ్ బోర్డు సీఈఓపై ఏం చర్యలు తీసుకున్నారో కూడా తెలపాలని స్పష్టం చేసింది. నివేదిక సమర్పించలేక పోతే.. మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వ్యక్తిగతంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఇదీ చదవండి :జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆపాలన్న పిల్‌పై హైకోర్టు ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details