సీఐడీ ఇచ్చిన నోటీసులను రద్దు చేసిన ఏపీ హైకోర్టు - అగ్రిగోల్డ్ ఆస్తులపై సీఐడీ నోటీసులు న్యూస్
అగ్రిగోల్డ్ ఆస్తుల వ్యవహారంతో ముడిపెడుతూ ఆ సంస్థ నుంచి గతంలో ఆస్తులు కొనుగోలు చేసిన పలువురికి అద్దె చెల్లించాలంటూ సీఐడీ ఇచ్చిన నోటీసులను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. ఆ తరహా తాఖీదుల జారీ చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది.
![సీఐడీ ఇచ్చిన నోటీసులను రద్దు చేసిన ఏపీ హైకోర్టు సీఐడీ ఇచ్చిన నోటీసులను రద్దు చేసిన ఏపీ హైకోర్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8700311-262-8700311-1599384413927.jpg)
ఆస్తిని జప్తు చేయడమంటే దానిని ఇతరులకు విక్రయించకుండా, తనఖా పెట్టకుండా నిలువరించడానికే గానీ వాటిపై అద్దె వసూలు చేయడానికి కాదని పేర్కొంది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఇటీవల ఈ తీర్పు ఇచ్చారు. అగ్రిగోల్డ్ కుంభకోణానికి ముందెప్పుడో కొనుగోలు చేసిన ఫ్లాట్లకు అద్దెను జమ చేయాలని కోరుతూ సీఐడీ నోటీసులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఫార్చూన్ హేలాపురి అపార్ట్మెంట్ యజమానులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. అగ్రిగోల్డ్ పూర్వ డైరెక్టర్లు కూడా కొన్ని పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలను విచారించిన న్యాయమూర్తి.. ఈ ఏడాది జూన్లో జారీ చేసిన నోటీసులను రద్దు చేశారు.