హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు... పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాదుల్నే బెదిరిస్తారా.. అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల తీరు నిజంగా సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించింది. దేనికైనా ఓ హద్దు ఉంటుందని తెలిపింది. ఎవరూ ఆ హద్దును అతిక్రమించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.
' గతంలో మేము డీజీపీని కోర్టుకు పిలిపించి .. రూల్ ఆఫ్ లా అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశాం. అందుకు డీజీపీ హామీ ఇచ్చారు. అయినా ఉపయోగం లేదు. మళ్లీ అవే ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఇలాగయితే రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతుంది. ఆ విషయాన్ని మేము స్పష్టంచేస్తున్నాం ' అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో రాజ్యాంగం బ్రేక్ డౌన్ జరిగిందా? లేదా ? అనే విషయాన్ని తదుపరి విచారణలో తేలుస్తామని హెచ్చరించింది. విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది.
హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. పోలీసులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతూ ఏపీ వ్యాప్తంగా పలువురి వ్యక్తుల్ని అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్న ఘటనల్లో వారిని కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు జారీచేయాలని అభ్యర్థిస్తూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది.
ఇక మీదట సహించం..
ప్రభుత్వ ప్రత్యేక కౌన్సిల్గా ఇటీవల నియమితులైన సీనియర్ న్యాయవాది ఎస్.ఎస్. ప్రసాద్ విచారణకు హాజరయ్యారు. తాజాగా నియమితులయ్యానని దస్త్రాలను పరిశీలించి వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని కోరారు. ఇలాంటి వ్యాజ్యాల్లో ఎక్కువ సమయం ఇచ్చేది లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది. ఇక మీదట సహించబోమని వ్యాఖ్యానించింది.
ఓ పిటిషనర్ తరపు న్యాయవాది రవితేజ వాదనలు ప్రారంభిస్తూ .. సహచర న్యాయవాది ఇంటిపై తెల్లవారుజామున పోలీసులు అక్రమంగా దాడి చేశారన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఏపీలో రాజ్యాంగం బ్రేక్ డౌన్ జరిగిందా ? లేదా ? అనే విషయాన్ని తదుపరి విచారణలో నమోదు చేస్తామని ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. చట్టబద్ధపాలన రాష్ట్రంలో సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ న్యాయవాదులుగా మీపైనా ఉందని గుర్తుచేసింది.