తెలంగాణ

telangana

'తెలుగును రక్షించుకుందాం.. తెలివితేటలు పెంచుకుందాం'

By

Published : Dec 25, 2022, 8:44 AM IST

Justice AV Seshasai speech at Telugu Conferenc : తెలుగును రక్షించుకుందాం.. తెలివితేటలు పెంచుకుందాం అని ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.వి. శేషసాయి పేర్కొన్నారు. మాతృభాష పరిరక్షణలో తల్లులు, గురువులదే కీలక భూమిక అన్నారు. ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడలో రెండు రోజుల పాటు జరిగిన తెలుగు రచయితల ఐదో మహాసభల్లో.. తెలుగు భాష పరిరక్షణ కోసం 18 తీర్మానాలు చేశారు.

World Telugu Writers Congress
World Telugu Writers Congress

Justice AV Seshasai speech at Telugu Conferenc : తెలుగు ప్రజల పెద్ద పండుగైన సంక్రాంతికి ఘనమైన ఆహ్వానం పలికేలా ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ వేదికగా ప్రపంచ తెలుగు రచయితల ఐదో మహాసభలను ఘనంగా నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలు శనివారం ముగిశాయి. పాత తరం ఘనతలను గుర్తుచేస్తూ.. వర్తమానంలోని పరిస్థితులను ఉటంకిస్తూ.. భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన కర్తవ్యాన్ని నిర్దేశిస్తూ.. ఈ మహాసభలు వివిధ అంశాలపై కూలంకుషంగా చర్చించాయి.

అమృతం లాంటి తెలుగుభాషని మృత భాష కానీయరాదని.. తెలుగు రాష్ట్రాలతో పాటు రాష్ట్రేతర ప్రాంతాలు, వివిధ దేశాల నుంచి వచ్చిన సాహితీవేత్తలు, భాషాభిమానులు, రచయితలు.. తమ ధృఢ సంకల్పాన్ని వ్యక్తం చేశారు. మాతృభాషపై అభిమానంతో భాషా సంస్కృతుల పరిరక్షకులుగా.. తెలుగువారంతా తెలుగుభాషను వర్ధిల్లేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. శతక పద్యాలు, సూక్తులు, జాతీయాలు, సామెతలు వంటివాటిని పిల్లలకు నేర్పించి.. వారిని తెలుగులో ఎదగనివ్వాలని తల్లిదండ్రులను అభ్యర్థించారు.

తమిళులు, కన్నడిగులతో పోలిస్తే తెలుగువారిలో భాషాభిమానం తక్కువేనని.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.వి.శేషసాయి అన్నారు. రెండో రోజు మహాసభలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. మాతృభాష పరిరక్షణలో తల్లులు ముఖ్యభూమిక పోషించాలని పిలుపునిచ్చారు. భాషను అలక్ష్యం చేస్తే ఆ జాతి మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్నారు.. పాలమీగడ, జున్ను లాంటి తెలుగుభాష పాశ్చాత్య ఇంగ్లీషు ప్రవాహంలో నలిగిపోతోందని ప్రజాకవి అందెశ్రీ మదనపడ్డారు.

18 తీర్మానాలు ఆమోదం: తెలుగు భాష గొప్పతనాన్ని, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ ఆయన ఆలపించిన గేయం అందరినీ అలరించింది. ఆలోచింపజేసింది. తెలుగు భాషకు నిత్యకల్యాణం జరగాలని ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఆకాంక్షించారు. భాషను చిన్నచూపు చూస్తే.. ఆ తర్వాత జరిగే పరిణామాలను మనం తట్టుకోలేమన్నారు. రెండు రోజుల మహాసభల్లో.. సాహితీవేత్తలు, రచయితలు, భాషాభిమానులు.. అనేక అంశాలపై చర్చించిన అనంతరం 18 తీర్మానాలను ఆమోదించారు.

ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే జరిగేలా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని.., తమిళనాడులో మాదిరిగా మాతృభాషలో చదివినవారికి ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించారు. వీటిని అమలు చేయాలని.. తెలుగు ప్రజలు, విద్యారంగ నిపుణులు, విద్యాసంస్థల యజమానులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను అభ్యర్థించారు. ప్రపంచ తెలుగు రచయితల ఐదో మహాసభల ముగింపు సందర్భంగా.. కె.వి.సత్యనారాయణ బృందం ప్రదర్శించిన ఆముక్తమాల్యద నృత్యరూపం వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది..

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details