గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై కింది కోర్టులు ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేసేందుకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదని జీహెచ్ఎంసీని హైకోర్టు ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాదులు సరైన విధంగా అభ్యంతరాలు తెలపనందునే.. స్టే ఆదేశాలు జారీ అవుతున్నాయని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అక్రమ నిర్మాణం పూర్తయ్యే వరకు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించిన పలు వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలోనే సుమారు లక్ష అక్రమ నిర్మాణాలున్నాయని.. ఇక రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఏమిటని హైకోర్టు పేర్కొంది.
నిబంధనలు, విధివిధానాలు కాగితాల్లో బాగానే ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గుర్తించిన అక్రమ నిర్మాణాలు, తీసుకున్న చర్యలు, స్టేలు ఎత్తివేసేందుకు చేపట్టిన చర్యలపై నివేదికలు సమర్పించని జోనల్ కమిషనర్లపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కొవిడ్ కారణాలు చూపుతూ విధుల నిర్వహణ నుంచి తప్పించుకోరాదని స్పష్టం చేసింది. నివేదికలు సమర్పించని అధికారులు ఖర్చుల కింద 10వేల రూపాయల చొప్పున చెల్లించాలని ఆదేశించింది. రెండు వారాల్లో నివేదికలు సమర్పించాలని చివరి అవకాశం ఇచ్చిన ధర్మాసనం.. విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది.