తెలంగాణ

telangana

By

Published : Jul 7, 2021, 9:44 AM IST

ETV Bharat / state

KIRTHICHAKRA: ‘కీర్తిచక్ర’ అవార్డు గ్రహీత కుటుంబానికి గౌరవం ఇదేనా?

‘కీర్తిచక్ర’ అవార్డు(KIRTHI CHAKRA)గ్రహీత కుటుంబానికి మీరిచ్చే గౌరవం ఇదేనా.. అంటూ రెవెన్యూ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. తీవ్రవాదుల దాడిలో అసువులు బాసిన ఓ ఐఎఫ్‌ఎస్‌ అధికారి కుటుంబానికి ఇస్తామన్నా ఫ్లాటును ఏడేళ్లయినా అప్పగించకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

high-court-fires-on-revenue-officers-for-kirthi-chakra-vadapalli-venkateshwara-rao-issue
‘కీర్తిచక్ర’ అవార్డు గ్రహీత కుటుంబానికి గౌరవం ఇదేనా?

తీవ్రవాదుల దాడిలో మృతి చెంది కీర్తిచక్ర పురస్కారాన్ని పొందిన అధికారి కుటుంబానికి సాయంగా ఉంటామని ప్రకటించి ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటున్న రెవెన్యూ అధికారుల తీరుపై మంగళవారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2008లో అఫ్గానిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయంపై జరిగిన తీవ్రవాదుల దాడిలో.. రాయబారిగా ఉన్న ఐఎఫ్‌ఎస్‌ అధికారి వాడపల్లి వెంకటేశ్వరరావు(VADAPALLI VENKATESHWARA RAO) మరణించారు. కాగా ఆయన కుటుంబానికి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో 475 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ... 2014లో జీవో జారీ చేసింది. అయితే ఆ స్థలాన్ని అధికారులు ఇప్పటి వరకు అప్పగించలేరు.

ఇంకెంత కాలం ఇలా తిప్పుకుంటారు..?

ఏడేళ్లయినా ఫ్లాట్ అప్పగించకపోవడంతో వాడపల్లి వెంకటేశ్వరరావు భార్య మాలతీరావు హైకోర్టుకు లేఖ రాశారు. స్పందించిన ధర్మాసనం ఆ లేఖనే పిటిషన్‌గా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి(JUSTICE HIMA KOHLI), జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది భాస్కర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. జీవోలో పేర్కొన్న 58వ ప్లాటు 475 చదరపు గజాలని ఉందని తెలిపారు. కానీ సర్వే నిర్వహిస్తే 411 గజాలు మాత్రమే ఉందన్నారు. కొంత గడువిస్తే తగిన ప్లాటు కేటాయిస్తామని ఆయన హైకోర్టుకు విన్నవించారు. కాగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కలెక్టర్‌ సూచనల మేరకు ప్రత్యామ్నాయంగా మరో ప్లాట్‌ను పిటిషనర్‌ ఎంపిక చేసుకోగా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. జీవో జారీ చేసి ఏడేళ్లయిందని, ఇంకెంతకాలం ఇలా తిప్పుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

రెవెన్యూశాఖ కార్యదర్శే ఆమె చుట్టూ తిరగాలి..

దీనిపై న్యాయవాది స్పందిస్తూ.. పైన పేర్కొన్న ప్రకారం దరఖాస్తు చేసుకుంటే చర్యలు చేపడతామనగా ధర్మాసనం నిరాకరించింది. ఇంతకాలం ఓ వితంతు మహిళ కార్యాలయాల చుట్టూ తిరిగారని.. ఇకపై జీవో జారీ చేసిన రెవెన్యూశాఖ కార్యదర్శి ఆమె చుట్టూ తిరిగి ప్లాటు అప్పగించాలని స్పష్టం చేసింది. ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన ఓ ఐఎఫ్‌ఎస్‌ అధికారికి కేంద్రం కీర్తిచక్ర(KIRTHI CHAKRA) పురస్కారాన్ని ఇచ్చి గౌరవిస్తే... మీరు మాత్రం ఫ్లాటు కోసం ఏళ్ల తరబడి తిప్పుకోవడం సరికాదని తెలిపింది. పిటిషనర్‌కు స్థలం గుర్తించి అప్పగించే బాధ్యతను అధికారులే తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. తీసుకున్న చర్యలపై కౌంటరు దాఖలు చేయాలంటూ విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:REVANTH REDDY: 'ప్రజలు.. తెరాస నుంచి విముక్తి కోరుతున్నారు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details