తెలంగాణ

telangana

By

Published : Aug 16, 2020, 5:12 AM IST

Updated : Aug 16, 2020, 6:36 AM IST

ETV Bharat / state

జలసంద్రాలుగా జిల్లాలు... ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీవర్షాలతోపాటు... మరికొన్న చోట్ల ఎడతెగని వానలు కురుస్తున్నాయి. జలాశయాలు, చెరువులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకొని మత్తడి దుంకుతున్నాయి. కొన్ని చోట్ల వాగుల ప్రవాహ ఉద్ధృతితో వివిధ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

heavy rains in telangana
heavy rains in telangana

జలసంద్రంగా జిల్లాలు... ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు జలకళ సంతరించుకున్నాయి. మానకొండూరు నియోజకవర్గంలోని చెరువుల్లో అలుగుపారుతున్నాయి. గన్నేరువరం మండలంలో మధ్యమానేరుకు అనుసంధానంగా నిర్మించిన ఉప కాలువలు తెగిపోయి.. పొలాల్లోకి నీరు చేరి నష్టం వాటిల్లింది. తోటపల్లి ప్రాజెక్టు నీటిమట్టం పెరిగి నీరు రాజీవ్ రహదారిపైకి చేరింది. పెద్ద చెరువు మత్తడి దుంకుతుండగా బిక్క వాగు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. నల్లగొండ, మట్టపల్లి, నేదునూరు, లక్ష్మిదేవిపల్లి గ్రామాల్లో వరద చేరి పంటనష్టంపాలైంది.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు మత్తడి దుంకుతోంది. 4 ఏళ్ల తర్వాత అలుగుపారడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోహెడ మండలం బస్వాపూర్ వద్ద గల్లంతైన లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చెట్టుకు పట్టుకొని ఉన్న డ్రైవర్‌ను కాపాడేందుకు తాడు సహాయంతో ప్రయత్నించగా ఉద్ధృతితో డ్రైవర్ కొట్టుకు పోయాడు. మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో హెలికాప్టర్‌తో గాలించగా ఫలితం కనిపించడంలేదు. ఎన్డీఆర్​ఎఫ్​​ బృందం బోటు సహాయంతో గాలింపు కొనసాగిస్తోంది.

ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా జోరుగా వర్షాలుకురుస్తున్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని రుద్రమ్మ చెరువు అలుగు పారుతోంది. ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికలపేట మండలంలో బొక్కి వాగు వరద ఉద్ధృతిలో 60 మంది గ్రామస్థులు చిక్కుకుపోయారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి, ఇందల్‌వాయి, డిచ్‌పల్లి మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో చెరువులు, కుంటలు, మత్తడి దుంకుతూ జలకళ సంతరించుకున్నాయి.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అన్నిశాఖల అధికారులు 24 గంటలపాటు అందుబాటులో ఉండాలని జిల్లా పాలనాధికారి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా నుంచి దేవరకద్ర వైపు వెళ్లే రహదారిపై గుంతలు పడటంతో... వాహనాల రాకపోకలతు అంతరాయం ఏర్పడింది.

రాష్ట్రంలోని ములుగు జిల్లా వాజీద్ మండలంలో అత్యధికంగా 104.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.... వెంకటాపురంలో 101.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కుమ్రం భీం జిల్లా బెజ్జూరులో 100.5 మిల్లీమీటర్లు.... పెంచికల్‌పేటలో 85.78 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా సిద్దిపేట జిల్లా కొహెడ మండలంలో 52.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

ఇవీచూడండి:బామ్మ అభ్యర్థనకు ముగ్ధుడైన మంత్రి...

Last Updated : Aug 16, 2020, 6:36 AM IST

ABOUT THE AUTHOR

...view details