తెలంగాణ

telangana

ETV Bharat / state

జోరు వానలో తడిసి ముద్దైన భాగ్యనగరం

ఎండల ధాటికి ఇళ్లలోంచి కదల్లేకపోయారు.. లోపలే ఉందామంటే ఉక్కపోత.. బయటకెళ్తామంటే రోడ్డుపై తారు కరిగిపోయేంత వేడి.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన భాగ్యనగర వాసులకు వర్షం సాంత్వనం కలిగించాయి. చినుకుగా మొదలైన చిరుజల్లు... జోరు వానగా జారి... చూస్తుండగానే భారీ వర్షమై లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. భాగ్యనగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది.

By

Published : May 31, 2020, 5:47 PM IST

Updated : May 31, 2020, 10:36 PM IST

heavy rains in hyderabad
జోరు వానలో తడిసిన భాగ్యనగరం

హైదరాబాద్​లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మబ్బుగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం సమయంలో పూర్తిగా చల్లబడి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. భాగ్యనగరంలో అత్యధికంగా సౌత్​ హస్తినాపురంలో 6.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో 5.3, వనస్థలిపురంలో 3.9 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.

నగరం నలుమూలలా జోరువానే...

హైదరాబాద్​ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, మలక్‌పేట్‌, చంపాపేట్‌, మల్కాజిగిరి, నేరేడ్‌మెట్‌, ఈసీఐఎల్, నాగారం, జవహర్‌నగర్, కీసర, దమ్మాయిగూడ, అంబర్‌పేట్, కాచిగూడ, నల్లకుంట, ఎల్బీనగర్, మన్సురాబాద్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి, హయత్‌నగర్, తుర్కయాంజల్, కూకట్‌పల్లి, మెహదీపట్నం, గోషామహల్, బేగంబజార్‌, చాదర్‌ఘాట్, సైదాబాద్, సంతోష్‌నగర్, మాదన్నపేట్‌, రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట్, అత్తాపూర్‌, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, బోరబండ, మోతీనగర్‌, ఈఎస్‌ఐ, సనత్‌నగర్‌, తార్నాక, మల్లాపూర్‌, హబ్సిగూడల లోని పలు చోట్ల చిరుజల్లులు కురవగా.. చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

వాన తెచ్చిన ఇక్కట్లు

భారీ వర్షంతో రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. పాదచారులు, ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీలు పొంగి పొర్లడం వల్ల లోతట్టు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది.

అప్రమత్తమైన జీహెచ్​ఎంసీ

భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్​ఎంసీ రంగంలోకి దిగింది. వాతావరణశాఖ సమాచారంతో క్షేత్రస్థాయిలో అప్రమత్తమైన జీహెచ్​ఎంసీ అధికారులు.. మాన్సూన్ అత్యవసర బృందాలను సిద్ధం చేశారు. నగర మేయర్​ బొంతు రామ్మోహన్... క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.

వచ్చే మూడు రోజులు వరుణుడి ప్రతాపం

ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ, రాయలసీమ, దక్షిణమధ్య కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వీటికి తోడు నైరుతు రుతుపవనాలు సోమవారం కేరళతీరాన్ని తాకే అవకాశం ఉందని వివరించారు.

జోరు వానలో తడిసిన భాగ్యనగరం

ఇదీ చూడండి:తెలుగు రాష్ట్రాల్లో మూడురోజుల పాటు వర్షాలు

Last Updated : May 31, 2020, 10:36 PM IST

ABOUT THE AUTHOR

...view details