తెలంగాణ

telangana

ETV Bharat / state

పురానాపూల్‌లో భారీ అగ్నిప్రమాదం.. పరారీలో గోడౌన్ యజమాని - హైదరాబాద్ పురానాపూల్‌లో భారీ అగ్నిప్రమాదం

Fire accident in Hyderabad: హైదరాబాద్​లోని పురానాపూల్‌లో ఓ భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 3 గంటల పాటు 6 ఫైరింజన్లు, 6 ట్యాంకర్లతో అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. గోదాం యజమాని పరారీలో ఉండటంతో... పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Fire accident
Fire accident

By

Published : Feb 15, 2023, 4:29 PM IST

Updated : Feb 15, 2023, 7:26 PM IST

Fire Accident in Hyderabad: వేసవికాలం రాక ముందే నగరంలో అగ్నిప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోజు ఏదో ఒక చోట చిన్నచితక మొదలుకొని అక్కడక్కడ భారీ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్​లోని పురానాపూల్​లో ఓ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మూసీ నది సమీపంలోని అశోక ఇండస్ట్రీస్ గోదాంలో ఉన్నటుండి మంటలు వచ్చాయి. ఫర్నిచర్‌ ఉన్న గోదాంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.

గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లు, 6 ట్యాంకర్లతో అగ్నిమాపక సిబ్బంది 3 గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. భారీగా ఎగిసిపడిన మంటల ధాటికి గోదాం పైకప్పు కూలడంతో.. సహాయకచర్యలు కొంత కష్టంగా మారాయని సిబ్బంది తెలిపారు. ముందు జాగ్రత్తలో భాగంగా అధికారులు.. గోదాం పరిసరాల్లోని కాలనీ వాసులను ఖాళీ చేయించి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఘటనా స్థలంలో 3 అంబులెన్స్​లను సిద్ధంగా ఉంచారు. ప్రమాదంలో ఆస్తినష్టం మాత్రం భారీగానే జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

పరారీలో గోదాం యాజమాని : మంటలు అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది గోదాం గోడలను పొక్లెయినర్లతో కూల్చారు. మంటల దాటికి చుట్టుపక్కల దట్టంగా పొగలు అలుముకోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఊపిరి పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా మారిందంటూ కాలనీల వాసులు వాపోయారు. కాసేపు అగ్నిమాపక సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. జనావాసాల మధ్య గోడౌన్​లకు అనుమతి ఎలా ఇచ్చారంటూ అధికారులను నిలదీశారు. పోలీసులు గోదాం యాజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యజమాని పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

'మంటలు పూర్తిగా ఆర్పి వేశాం. రెండున్నర గంటలకు పైగా సిబ్బంది శ్రమించారు. ఫైర్ ఫైటింగ్లో 30 మంది సిబ్బంది పాల్గొన్నారు. వేసవి సమీపిస్తుంది కనుక జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 1250 భవనాలు, గోదాములు గుర్తించాం. భవన యజమానులందరికీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాం. దక్కన్ మాల్ ఘటన తర్వాత కొన్ని విషయాలపై అధ్యయనం చేస్తున్నాం. విద్యుత్, జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటున్నాం.'-పాపయ్య, రీజినల్ ఫైర్ అధికారి

అగ్ని ప్రమాదాలపై ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహిస్తున్నామని అగ్నిమాపక శాఖ ప్రాంతీయ అధికారి తెలిపారు. ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ మరింత బలోపేతం చేసేందుకు అందరు అధికారులు కృషి చేస్తున్నారన్నారు. పురానాపూల్​లో అగ్నిప్రమాదం మానవ తప్పిదం వల్ల జరిగినట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. ఈరోజు పనివాళ్లు ఎవరు అశోక్ ఇండస్ట్రీస్ లోపలికి రాలేదని స్థానికులు చెబుతున్నారని రీజినల్ ఫైర్ అధికారి పాపయ్య వెల్లడించారు. ఓ వ్యక్తి సిగరెట్ తాగి పడేయడం వల్ల అగ్నిప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారని వివరించారు.

హైదరాబాద్ పురానాపూల్‌లో భారీ అగ్నిప్రమాదం

ఇవీ చదవండి:

Last Updated : Feb 15, 2023, 7:26 PM IST

ABOUT THE AUTHOR

...view details